
సిడ్నీ: బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల ప్రారంభం అయిన మూడో టెస్టు మ్యాచ్లో ఆసీస్ బ్యాట్స్మన్ నిలకడగా ఆడుతున్నారు. యువ ఓపెనర్ విల్ పకోస్కీ (54) అర్ధ సెంచరీ చేశాడు. పకోస్కీ ఆసీస్ తరఫున ఈరోజే ఆరంగేట్రం చేశాడు. ఆడుతుంది తొలి టెస్ట్ మ్యాచ్ అయినా.. ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత పేస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ 100 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 54 పరుగులు చేశాడు. మరోవైపు మార్నస్ లబుషేన్ (34) నిలకడ బ్యాటింగ్తో ఆసీస్ టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోయి 93 పరుగులు చేసింది.
వర్షం అంతరాయం కలిగించడం వలన కాస్త ఆలస్యంగా ఆట ప్రారంభం అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ గట్టి షాక్ ఇచ్చాడు. అద్భుత బంతితో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను పెవీలియన్కు పంపాడు. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో వార్నర్ స్లిప్లో చేటేశ్వర్ పూజారా చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు. ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసిన సమయంలో వరణుడు అడ్డుపడడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో అరగంట ముందే లంచ్ బ్రేక్ ఇచ్చారు.
లంచ్ తర్వాత విల్ పకోస్కీ, మార్నస్ లబుషేన్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. చెత్త బంతిని మాత్రమే బౌండరీకు తరలించారు. అయితే ఇద్దరు బ్యాట్స్మెన్స్కు చెరో లైఫ్ రావడంతో మరింత పుంజుకున్నారు. ఆసీస్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. భారత కెప్టెన్ బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. పకోస్కీ తన ఫస్ట్ క్లాస్ ఫామ్ కొనసాగిస్తూ.. అంతర్జాతీయ తొలి టెస్ట్ మ్యాచ్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆసీస్ టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోయి 93 పరుగులు చేసింది.