హైదరాబాద్: ఆస్ట్రేలియాతో శనివారం నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టులో వంద శాతం ఫిట్గా ఉంటేనే బరిలోకి దిగుతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టంచేశాడు.
'నేను వంద శాతం ఫిట్గా ఉంటే ధర్మశాల టెస్టులో ఆడతా. ప్రస్తుతం ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఇంకా చికిత్స తీసుకుంటున్నానని, ఆడతానో లేదో ఇప్పుడే ఏమీ చెప్పలేను. ప్రతి మ్యాచ్ తనకు ముఖ్యమైనదేనని, పూర్తి ఫిట్గా ఉంటేనే ఆడతా. తమ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్తో ఫిట్నెస్పై చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటా' అని కోహ్లీ తెలిపాడు.
శనివారం ఉదయానికి కానీ, శుక్రవారం రాత్రికి కానీ చివరి టెస్టులో ఆడటంపై స్పష్టత వస్తుందని కోహ్లీ తెలిపాడు. సిరీస్లో తాను ఇప్పటివరకు చేసిందేమీ లేదని, అయినా టీమ్ గెలిచిందని కోహ్లీ చెప్పాడు. క్లిష్ట సమయాలను ప్లేయర్స్ ఎదుర్కొన్న తీరు చూసి గర్వపడుతున్నానని, రాంచీలో పుజారా, సాహా అద్భుతంగా ఆడారని కోహ్లీ ప్రశంసించాడు.

ఇక విమర్శలు వస్తూనే ఉంటాయని, ఎవరు ఏమన్నా తాను పట్టించుకోనని, తన గురించి టీమ్ సభ్యులు ఏమనుకుంటున్నారన్నదే తనకు ముఖ్యమని కోహ్లీ స్పష్టంచేశాడు. ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతున్నదని, మంచిగా ఆడినప్పుడు మెచ్చుకోవాల్సిందేనని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఇక తనపై ఉన్నవీ, లేనివీ కల్పించి వార్తలు రాస్తున్న ఆసీస్ మీడియాపై ధర్మశాల టెస్టుకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడాడు. 'ఒకే వ్యక్తి అందరిపై ప్రభావం చూపడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. వార్తలు అమ్ముకోవడానికి ఇది సాయపడితే వారికి గుడ్లక్' అని చెప్పాడు.
దీంతో ముందు జాగ్రత్తగా బీసీసీఐ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా శ్రేయాస్ను ఎంపిక చేసింది. శ్రేయాస్ అయ్యర్ శుక్రవారం మధ్యాహ్నం జట్టుతో కలిసే అవకాశముంది. చివరి టెస్టులో కోహ్లీ ఆడే పరిస్థితి లేకపోతే శ్రేయాస్ను ఆడించనున్నారు. అతడు మ్యాచ్ ఆడలేని స్థితిలో ఉంటే అయ్యర్కు అవకాశం లభించొచ్చు.
కోహ్లీ ఆడలేని పక్షంలో ముందు జాగ్రత్తగా అయ్యర్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ముంబైకి చెందిన ఈ యువ బ్యాట్స్మన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. గతేడాది రంజీల్లో అత్యధికంగా 1321 పరుగులు చేశాడు.