|
కోహ్లీ క్యాచ్ అందుకున్న సెక్యూరిటీ
ఆ బంతిని సరిగ్గా ఒడిసి పట్టుకున్నాడో వ్యక్తి. అతనెవరో కాదు.. బౌండరీ బయట భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్. కోహ్లీనే ఔట్ చేశావంటూ పలువురు అభిమానులు అతనికి అభినందనలు తెలుపుతూ సరదగా కామెంట్లు పెడుతున్నారు. ‘సెక్యూర్ హ్యాండ్స్! విరాట్ కోహ్లీ షాట్ అద్భుతం. కానీ ఈ సెక్యూరిటీ గార్డ్ ప్లేయర్ ఆఫ్ ది డేను సొంతం చేసుకున్నాడు' అని ట్వీట్ చేస్తున్నారు.
ఆసీస్ పర్యటనలో భారత తొలి విజయం
ఆదివారం విరాట్ ఆసీస్ మీద విశ్వరూపం చూపించాడు. ఒత్తిడిలో ఆచితూచి ఆడుతూనే జట్టుకు విజయం అందించాడు. మరో రెండు బంతులు మిగిలుండగానే టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కృనాల్ పాండ్య మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలి విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ చివరి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సిరీస్ను 1-1తో సమం చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికైన కృనాల్
ఆదివారం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. షార్ట్ (33) టాప్స్కోరర్. భారీ స్కోరు చేసేలా కనిపించిన ఆసీస్కు స్పిన్నర్లు కృనాల్ పాండ్య (4/36), కుల్దీప్ (1/19) కళ్లెం వేశారు. అనంతరం ఓపెనర్ ధావన్ (41), కెప్టెన్ కోహ్లి (61 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కృనాల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. తొలి టీ20లో భారత్ ఓడగా.. రెండో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. నాలుగు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ డిసెంబరు 6న అడిలైడ్లో మొదలవుతుంది.
ఆస్ట్రేలియా కంటే మేమే మెరుగ్గా ఉన్నాం
సిరీస్ సమమైందంటే రెండు జట్లు ఎలా ఆడాయో అర్థమవుతుంది. ఐతే నైపుణ్యం పరంగా ఆస్ట్రేలియా కంటే మేమే మెరుగ్గా ఉన్నాం. బంతితో మా ప్రదర్శన చాలా బాగుంది. మ్యాచ్లో ఆసీస్ 180 చేస్తుందనుకున్నాం. మేం తగ్గించగలిగిన 15 పరుగులే కీలకమయ్యాయి.