
సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సుదీర్ఘ సిరీస్ కోసం టీమిండియా ప్రాక్టీస్ మమ్మురం చేసింది. అవుట్డోర్ ప్రాక్టీస్లో భాగంగా మంగళవారం సిడ్నీ మైదానంలో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీతో సహా ఆటగాళ్లు ప్రాక్టీస్ పిచ్లపై కఠిన సాధన చేశారు. ఆటగాళ్లు చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 'విరాట్ కోహ్లీ క్లాస్.. వేగవంతమైన మరియు ఖచ్చితమైన బంతులతో షమీ, సిరాజ్ టీమిండియా నెట్స్లో కలిసి బౌలింగ్ చేశారు' అని పేర్కొంది.
సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలోని నెట్ షెషన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమించాడు. పేస్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ బౌలింగ్ చేస్తుండగా.. విరాట్ మంచి షాట్లతో అలరించాడు. రవీంద్ర జడేజా వేసిన స్పిన్ బౌలింగ్లో కూడా పలు షాట్లు ఆడాడు. డిఫెన్స్, కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్ షాట్లు ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆ తరువాత స్పీడ్ పెంచాడు. మరోవైపు షమీ అద్భుత బంతులతో ఆకట్టుకున్నాడు. కోహ్లీని కాసేపు ఇబ్బందిపెట్టాడు. కోహ్లీ తన ప్రాక్టీస్కు సంబందించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. లవ్ టెస్ట్ క్రికెట్.. ప్రాక్టీస్ సెషన్' అని కాప్షన్ పెట్టాడు.
వికెట్ కీపర్, బ్యాట్స్మన్ సంజూ శాంసన్ కూడా నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. తంగరాజు నటరాజన్, దీపక్ చహర్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన నటరాజన్ తెల్ల బంతులతో బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేశాడు. యార్కర్లతో బెంబేలెత్తించాడు. టెస్ట్ ఆటగాళ్లు కూడా జట్టుతోనే ఉండడంతో నెట్స్లో అటు తెల్ల బంతులతో పాటు ఇటు ఎర్ర బంతులతోనూ సాధన చేశారు. కొందరు ఆటగాళ్లు క్యాచ్ల ప్రాక్టీస్ కూడా చేశారు.
సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ సోమవారం వార్మప్ చేస్తూ జాలీగా కనిపించారు. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్తో ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆసీస్తో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. తొలి టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లీ భారత్ రానున్న విషయం తెలిసిందే.