హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆసీస్ ఆటగాళ్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చురకలంటించాడు. తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయమైన సంగతి తెలిసిందే.

దీంతో రెండో రోజు కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. అయితే తొలి రోజు కోహ్లీ భుజానికి గాయం అయిన తర్వాత ఎలాగైతే ఇబ్బంది పడ్డాడో అదేవిధంగా మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రవర్తించాడు. కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 80.3 ఓవర్లో పుజారా అడిన షాట్ను బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్వెల్ ఆపాడు.
అనంతరం భుజం పట్టుకొని కోహ్లీని ఎగతాళి చేశాడు. ఆ తర్వాత మూడో రోజు బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీని స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజం నొప్పిలా చేతిని పట్టుకొని కోహ్లీ గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎగతాళి చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకున్న కెప్టెన్ కోహ్లీ అదే రీతిలో సమాధానం ఇచ్చాడు.
నాలుగో రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటవ్వడంతో తన భుజాన్ని తడుముతూ మరికొంచెం ఎక్కువ వెటకారంగా ప్రవర్తించాడు. ఈ వీడియోని కోహ్లీ అభిమానులు ట్వీట్టర్, ఫేస్బుక్లో షేర్చేస్తూ కోహ్లీకి మద్దతు తెలిపారు.
భుజం నొప్పి గాయంతో తొలి ఇన్నింగ్స్లో విశ్రాంతి తీసుకున్న కోహ్లీ, రెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే జట్టుని నడిపించాడు. రాంచీ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.