

హైదరాబాద్: నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్లో విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అనూహ్య రీతిలో రనౌట్గా పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. స్ట్రైకింగ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన స్ట్రైట్ డ్రైవ్కి విజయ్ శంకర్ రనౌట్గా వెనుదిరిగాడు.
ఆడమ్ జంపా వేసిన 29 ఓవర్ ఐదో బంతిని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. అది కాస్తా జంపా చేతి వేళ్లకు తాకుతూ వికెట్లను తాకింది. ఆ సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న విజయ్ శంకర్ బ్యాట్ను క్రీజ్లో పెట్టే యత్నం చేసినప్పటికీ బంతి వికెట్లను తాకడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఫలితంగా వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
ఇదే మ్యాచ్కే కీలక మలుపు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (21)తో పాటు అంబటి రాయుడు (18) విఫలమైనా.. రెండో ఓవర్ నుంచి 48వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లి జట్టుకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా చూడచక్కని ఫోర్ బాదిన కోహ్లీ 40వ సెంచరీని పూర్తి చేశాడు. కోహ్లీతో పాటు విజయ్ శంకర్ (46) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో భారత్ జట్టుని గెలిపించిన కేదార్ జాదవ్ (11), ధోనిలు ఈ మ్యాచ్లో వరుస బంతుల్లో ఔటయ్యారు.
జట్టు స్కోరు 248 వద్ద కోహ్లీ ఔటవగా.. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలోనే కుల్దీప్ యాదవ్ (3), జస్ప్రీత్ బుమ్రా (0) వికెట్లు చేజార్చుకున్నారు. ఆస్ట్రేలియా జట్టులో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు, కౌల్టర్ నైల్, మాక్స్వెల్, నాథన్ లయాన్ తలో వికెట్ తీశారు.