
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తొలుత నెమ్మదిగా ఆడి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77) క్రీజులో నిలవడంతో టీమిండియా 32 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లకు వికెట్ ఇవ్వలేదు.
రెండో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యం
అయితే పుజారా, మాయాంక్ రెండో వికెట్కు 116 పరుగులు జోడించడంతో భారత్ పటిష్ఠ స్థితికి చేరుకుంది. హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం మయాంక్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ సిక్స్ బాదిన మయాంక్, ఆ తర్వాత బంతిని కూడా అలానే హిట్ చేసేందుకు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు.
23 పరుగులు చేసిన కోహ్లీ
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (23) జట్టు స్కోరు 180 వద్ద మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్ రహానే (18)తో కలిసి పుజారా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే కీలక సమయంలో కోహ్లీ, రహానే ఔటైనా... పుజారా మాత్రం నిలకడగా ఆడుతూ ఈ సిరీస్లో మూడో సెంచరీని నమోదు చేసుకున్నాడు.
టెస్టుల్లో 18వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ
టెస్టుల్లో పుజారాకు ఇది 18 సెంచరీ కాగా, ఈ సిరిస్లో మూడోది కావడం విశేషం. ఈ క్రమంలో పుజారా ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న తొలి భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. రహానే తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారి... పుజారాకు చక్కటి సహకారం అందించాడు.
హాజెల్వుడ్ రెండు వికెట్లు
దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి హమను విహారి 58 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో భారత్ తొలిరోజు 90 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజెల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా... లియాన్, స్టార్క్ చెరో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications
