బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. గతేడాది సిరీస్ ఓటమికి టీమిండియా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. అయితే మూడో వన్డే మ్యాచ్లో భారత ఆటగాళ్లు అందరూ తమ భుజాలకు నల్లరిబ్బన్ ధరించి ఆడారు.
మూడో వన్డేలో ధావన్కు గాయం.. కివీస్ పర్యటనకు డౌటే?
ఇటీవలే మరణించిన దిగ్గజ ప్లేయర్ బాపు నాదకర్ణికి సంతాప సూచకంగా భారత ప్లేయర్లు ఈ నల్ల రిబ్బన్ను ధరించారు. ఈనెల 17న బాపు మరణించారు. నాదకర్ణి మృతిపై టీమిండియా మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి దిగ్గజాలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాపు మరణించడం చాలా బాధకరమని సచిన్ పేర్కొన్నారు. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలని ఆయన చెబుతుండేవారని సన్నీ తెలిపారు.
టెస్టు క్రికెట్లో స్పిన్నర్ బాపు నాదకర్ణికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 1961లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో బాపు ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు. ఆ మ్యాచ్లో సంచలనాత్మక స్పెల్ (32-27-5-0) వేశారు. 32 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చారు. 27 మెయిడిన్లు వేయడం విశేషం. అయితే వరుసగా 21 మెయిడిన్లు వేయడం మరో విశేషం. ఇప్పటికీ ఈ రికార్డు అలానే ఉంది. మోతమ్గా బాపు 45 టెస్టులాడి 88 వికెట్లు తీశారు. ఎకానమీ రేటు కేవలం 1.68గా ఉంది. 50 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసినా వాళ్లలో ఆయనదే బెస్ట్.
మూడో వన్డేలో 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 289 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (119; 128 బంతుల్లో 8x4, 6x6) శతకానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (89; 91 బంతుల్లో 8x4) అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు కీలకమైన 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రేయస్ అయ్యర్ (44; 35 బంతుల్లో 6x4, 1x6) ధాటిగా ఆడాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్స్మిత్ (131; 132 బంతుల్లో 14x4, 1x6), మార్నస్ లబుషేన్ (54; 64 బంతుల్లో 5x4) రాణించారు.