ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓటమితో భారీ అప్రదిష్ట మూటగట్టుకున్న టీమిండియా.. తొలి టీంగా చెత్త రికార్డ్

మొహాలీ: టీ20ప్రపంచకప్ ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియాకు తొలి మ్యాచ్లో గట్టి షాక్ తగిలింది. మంగళవారం జరిగిన తొలి టీ20లో పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్తో రోహిత్ సేన 4వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో మూడు టీ20ల సిరీస్లో ఫించ్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
209 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం టీమిండియా కాపాడుకోలేకపోయింది. బ్యాటర్లు అదరగొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో జరిగిన పొరపాట్లు భారత్ కొంపముంచాయి. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు బౌండరీలకు గేట్లేత్తెశారు. ఈ మ్యాచ్ ఓటమితో భారత్ ఓ అప్రదిష్ట మూటగట్టుకుంది.

అప్పుడు పంత్ కెప్టెన్సీలో.. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో
స్వదేశంలో ఒక క్యాలెండర్ ఇయర్లో ఒకటి కంటే ఎక్కువసార్లు టీ20 మ్యాచ్లలో 200 ప్లస్ టార్గెట్లను డిఫెండ్ చేసుకోవడంలో విఫలమైన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 2016లో దక్షిణాఫ్రికా స్వదేశంలో 200పైచిలుకు పరుగులను కాపాడుకోలేక ఓటమి పాలయి ఈ చెత్త రికార్డ్ నెలకొల్పిన జట్టుగా నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఆ జట్టు ఒకటి కంటే ఎక్కువసార్లు ఎప్పుడూ కూడా స్వదేశంలో 200పరుగులు చేసినప్పుడు ఓడిపోలేదు.
కానీ భారత్ మాత్రం ఈ క్యాలెండర్ ఇయర్లో రెండుసార్లు 200పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాతో జరిగిన 5-మ్యాచ్ల T20I సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ 211పరుగులను డిఫెండ్ చేసుకోలేక చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా మరో 5 బంతులు మిగిలి ఉండగానే స్కోరును ఛేదించింది. తాజాగా ఆస్ట్రేలియాపై 209పరుగులను కాపాడుకోలేకపోయింది.

చివర్లో ధాటిగా ఆడిన వేడ్
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 71 నాటౌట్) చెలరేగగా.. కేఎల్ రాహుల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 55), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ రెండు, జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం చేధనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6వికెట్లకు 211పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
కామెరూన్ గ్రీన్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 61) రాణించగా.. మాథ్యూవేడ్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 45 నాటౌట్) చివర్లో ధాటిగా ఆడి విజయాన్ని ఆసీస్ ఖాతాలో వేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్కు ఓ వికెట్ దక్కింది.

తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications