దుబాయ్: కంగారూల గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా మంగళవారం ముగిసిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇన్నింగ్స్ చివర్లో రిషభ్ పంత్ (89 నాటౌట్; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్ సుందర్ (22) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.
బ్రిస్బేన్లో సాధించిన చారిత్రక విజయంతో టీమిండియా మరోసారి టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్ జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ ఓటమితో ఇప్పటి వరకూ తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకూ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా టీమిండియా 5 సిరీస్లలో 13 టెస్టులు ఆడింది. 13 టెస్టుల్లో 9 విజయాలు సాధించి, మూడింట్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 71.7 శాతం విజయాలతో టీమిండియా టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది.
టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియా 4 సిరీస్లలో మొత్తం 14 మ్యాచ్లు ఆడింది. అందులో 8 గెలిచి, నాలిగింట్లో ఓడింది. మరో రెండు మ్యాచులను డ్రాగా ముగించింది. ఆస్ట్రేలియా ఖాతాలో 332 పాయింట్ల ఉండగా.. 69.2 శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఇక 70.0 శాతం విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ (65.2), దక్షిణాఫ్రికా (40.0), పాకిస్తాన్ (30.7), శ్రీలంక (19.0), వెస్టిండీస్ (11.1), బంగ్లాదేశ్ (0.0) వరుసగా ఉన్నాయి.
India on 🔝
— ICC (@ICC) January 19, 2021
After the hard-fought win at The Gabba, India move to the No.1 spot in ICC World Test Championship standings 💥
Australia slip to No.3 👇#WTC21 pic.twitter.com/UrTLE4Rui0
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా ఆటగాళ్లకు రూ.5 కోట్ల టీమ్ బోనస్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదో అద్భుత విజయం అని, ఆస్ట్రేలియాకు వెళ్లి టెస్ట్ సిరీస్ను గెలవడం అపూర్వమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఎన్నటికీ మరిచిపోనిదన్నారు. ఈ గెలుపు విలువకు ఏదీ సమానం కాదన్నారు. టూర్లో పాల్గొన్న ప్రతి ఆటగాడిని దాదా మెచ్చుకున్నారు.
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!