హైదరాబాద్: ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు శుక్రవారం విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లకు అధికారులతో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ ఇండియా విమానంలో భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ తదితరులు నగరానికి చేరుకున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు శుక్రవారం సాయంత్రానికి విశాఖకు చేరుకోనుంది. ఆస్ట్రేలియా భారత పర్యటనలో భాగంగా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. రెండు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురువారమే విశాఖకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 24న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్లో పాల్గొనేందుకు ధోనీ జట్టుతో పాటు కాకుండా ఒకరోజు ముందుగానే విశాఖపట్నానికి చేరుకున్నాడు. రాయ్పూర్ నుంచి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిరిండియా విమానంలో విశాఖ వచ్చిన ధోనీకి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.
తొలి టీ20కి ఆతిథ్యమిస్తోన్న విశాఖ స్టేడియంలో టీమిండియా అనేక విజయాలను అందుకుంది. మూడేళ్ల క్రితం భారత పర్యటనలో శ్రీలంక జట్టు సిరీస్లో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ను విశాఖలో ఆడింది. ఈ మ్యాచ్కి ముందు ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ సమం అయింది. విశాఖలో జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో పాటు సిరిస్ను కూడా కైవసం చేసుకుంది.