
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా కంగారూల గడ్డపై అడుగుపెట్టింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు గురువారం సిడ్నీకి చేరుకుంది. దుబాయ్ నుంచి బయలుదేరిన భారత జట్టు ప్లేయర్లు, సహాయక సిబ్బంది సుమారు 20 గంటలు ప్రయాణించి సిడ్నీ చేరుకున్నారు. సిడ్నీ ఎయిర్పోర్టులో కోహ్లీసేన దిగిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. కరోనా కారణంగా భారత బృందం సభ్యులు పీపీఈ కిట్లు ధరించి ఫేస్ మాస్క్లు పెట్టుకొన్నారు.
ఐపీఎల్ 2020 కోసం బయో బబుల్ వాతారణంలోనే ఉన్న భారత ఆటగాళ్లు.. సిడ్నీలో క్వారంటైన్లో ఉంటూ ప్రాక్టీస్ చేయనున్నారు. ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబర్ 27 నుంచి మూడు వన్డేల సిరీస్, డిసెంబర్ 4 నుంచి మూడు టీ20ల సిరీస్ ఆరంభమవుతాయి. ఇక తొలి టెస్టు (డే/నైట్) డిసెంబర్ 17న అడిలైడ్లో మొదలవనుంది. ఇప్పటికే రెండు నెలల పాటు భారత్కు దూరంగా ఉన్న ఆటగాళ్లు.. మరో రెండు నెలల తర్వాత అడుగుపెట్టనున్నారు.
ఆస్ట్రేలియాతో త్వరలో ఆరంభమయ్యే టీ20, వన్డే సిరీసుల్లో కోహ్లీసేన సరికొత్త జెర్సీలు ధరించనుందని సమాచారం. ఇప్పుడున్న నీలం రంగులో కాకుండా.. నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పలు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఇప్పటి వరకు జెర్సీల మార్పుపై బీసీసీఐ అధికారికంగా వివరణ ఇవ్వలేదు. కాకపోతే కరోనా నేపథ్యంలో ఎక్కువ రక్షణ అందించే కిట్లు అందిస్తున్నామని మాత్రం చెప్పింది.
గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్లకు రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేయని సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్కు మాత్రం సెలక్టర్లు రోహిత్ను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొంటున్న రోహిత్.. పునరావాసం కోసం బెంగళూరులోని ఎన్సీఏకు చేరుకోనున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్తాడు. ఇక నాలుగు టెస్టుల సిరీస్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయనున్నాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరి ఆరంభంలో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని ఆశిస్తున్న విరాట్ కోహ్లీ డిసెంబరు 21న ఫస్ట్ టెస్టు ముగియగానే భారత్కి వచ్చేయనున్నాడు.