
సిడ్నీ: టీమిండియా పేస్ దళంలో మరో అస్త్రం చేరింది. బ్యాట్స్మెన్కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్ కట్టర్లు, నెమ్మది బంతులతో టీ నటరాజన్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోతున్నాడు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ భువనేశ్వర్ కుమార్ జట్టులో లేకపోయినా.. యువ పేసర్లు దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్తో కలిసి పేస్ దళం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై భారత్ టీ20 సిరీస్ గెలవడంలో నటరాజన్ కీలకపాత్ర పోషించాడు.
టీమిండియా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం నటరాజన్ ఓ ట్వీట్ చేశాడు. 'దేశం తరఫున గెలిచిన తొలి సిరీస్. ఇది చిరస్మరణీయం, ఎంతో ప్రత్యేకం' అని కాప్షన్ పెట్టాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి గాయమవ్వడంతో నట్టూకు కలిసి వచ్చింది. చివరలో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నట్టూ సంచలన ప్రదర్శనలతో అందరి ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. బుమ్రా మాదిరిగానే నటరాజన్ కంగారూల గడ్డపై అరంగేట్రం చేశాడని, త్వరలో ప్రపంచ మేటి బౌలర్గా మారుతాడని ఆశిస్తున్నారంతా.
'నటరాజన్ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మరో కీలక బౌలర్ను కనుగొంది. అతడు తన ప్రదర్శన ఇలానే కొనసాగిస్తాడని ఆశిస్తున్నా' అని రెండో టీ20లో వ్యాఖ్యాతగా ఉన్న ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ అన్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం జరగనుంది.
29 ఏళ్ల టీ నటరాజన్ ఆస్ట్రేలియా సిరీస్ ద్వారానే భారత్ తరఫున టీ20ల్లోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచులో మూడు వికెట్లు తీసిన నటరాజన్.. రెండో టీ20లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు ఇచ్చుకోగా.. నట్టూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.