హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశాంతంగా ఉంచితే ఆస్ట్రేలియా తప్పక విజయం సాధిస్తుందని ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. భారత్తో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్కు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా సెప్టెంబర్ 17న తొలి వన్డే జరగనుంది. అంతకముందు సెప్టెంబర్ 12వ తేదీన ఆస్ట్రేలియా జట్టు బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో నెట్ ప్రాక్టీస్ అనంతరం స్మిత్ మీడియాతో మాట్లాడాడు.

భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ను క్రీడాస్ఫూర్తితో ఆడతామని చెప్పాడు. 'విరాట్ కోహ్లీతో విభేదాల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. అతను అత్యుత్తమ ఆటగాడు. ఇక వన్డే రికార్డులు అమోఘం. ఈ సిరీస్లో సాధ్యమైనంత వరకు అతడిని ప్రశాంతంగా ఉంచడమే మా విజయానికి కీలకం. భారత్తో సిరీస్ అంటే కఠిన పోటీ తప్పదు. సాంతం క్రీడాస్ఫూర్తితో ఆడతాం' అని స్మిత్ అన్నాడు.
'టెస్టులతో పోలిస్తే వన్డే సిరీస్ భిన్నంగా ఉంటుంది. అక్షర్ పటేల్ బాగా ఆడుతున్నాడు. చాహల్, కుల్దీప్ కూడా జట్టులో ఉన్నారు. కోహ్లీ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు. మా వన్డే జట్టు స్పిన్ను బాగానే ఎదుర్కోగలదు. పిచ్ పరిస్థితులను బట్టి వ్యూహాలు రూపొందిస్తాం. మా ఆటగాళ్లు మెరుగవుతున్నారు. స్పిన్నర్ ఆడమ్ జంపాకు భారత్లో మంచి అనుభవం ఉంది' అని అన్నాడు.