బెంగుళూరు టెస్టు: కెప్టెన్ స్మిత్ 'చీటింగ్'పై ట్విట్టర్లో విమర్శలు
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో హైడ్రామా చోటు చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతోంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ వికెట్ను ఉమేశ్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్లో 21వ ఓవర్లో ఉమేశ్ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు.
దీంతో వెంటనే అంపైర్ కెప్టెన్ స్మిత్ అవుటైనట్లు ప్రకటించాడు. వెంటనే భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. వెంటనే రివ్యూ కోరదామని నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న హ్యాండ్స్ కోంబ్ను అడిగాడు. దీంతో అతడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపుతూ టీమ్ మేట్స్ను సలహా కోరమని సూచించాడు. ఇదంతా సమీపంలో ఉన్న కోహ్లీ గమనించి అంపైర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.
ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్కు ఇంకా ఒక రివ్యూ మాత్రమే మిగిలి ఉంది. అందుకే స్మిత్ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సభ్యులకు సంకేతాలు పంపాడు. వాళ్లు అవుట్ కాదని సూచిస్తే స్మిత్ రివ్యూని కోరదామని అనుకున్నాడు.
అంపైర్ను ఆశ్రయించిన కోహ్లీ
అయితే దీనిని గమనించిన కోహ్లీ అంపైర్ను ఆశ్రయించాడు. మైదానంలో ఉన్న హ్యాండ్స్ కోంబ్ వద్దకు వెళ్లి స్మిత్ మాట్లాడుతుండగా అంపైర్ వారిని నిలువరించాడు. అదే సమయంలో ఆసీస్ ఆటగాళ్లకు దగ్గరగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వచ్చాడు. దీంతో అప్రమత్తంగా వ్యవహరించిన అంపైర్ మరోసారి స్టీవ్ స్మిత్ను మైదానం వీడాల్సిందిగా సూచించాడు.
జరిగిన దానిపై కాసేపు చర్చించిన కోహ్లీ, ఫీల్డ్ అంఫైర్లు
స్మిత్ మైదానం వీడిన అనంతరం ఫీల్డ్ అంపైర్లు, కోహ్లీ జరిగిన దానిపై కాసేపు చర్చించారు. అనంతరం ఎవరి స్థానాలకు వాళ్లు వెళ్లిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. నిజానికి డీఆర్ఎస్లో భాగంగా రివ్యూ కోరాలా వద్దా? అన్నది క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్ మెన్ తీసుకోవాల్సిన నిర్ణయం.
స్మిత్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
కానీ స్మిత్ మాత్రం అందుకు విరుద్ధంగా డ్రెస్సింగ్ రూమ్ సలహా కోరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఆర్ఎస్ అంటే డ్రెస్సింగ్ రూమ్ రీవ్యూ సిస్టమా అంటూ బీసీసీఐ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను హేళన చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.
35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆసీస్ ఆలౌట్
రెండో ఇన్నింగ్స్లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ 1-1తో సమమైంది.
రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకున్న భారత్
బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా ఆరు వికెట్లు తీసుకోగా రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. మూడో టెస్టు మార్చి 16వ తేదీన రాంచీలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications