రిషబ్ పంత్ ఔటవ్వకుండా ఉండింటే
ఒకవేళ రిషబ్ పంత్ ఔటవ్వకుండా ఉండింటే తొలి టీ20లో మ్యాచ్లో భారత్ తప్పక విజయం సాధించేది. దీంతో షాట్ ఎంపిక విషయంలో రిషబ్ ఇకనైనా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ సూచించాడు. "దినేశ్ కార్తీక్తో కలిసి చివరి దాకా నిలిచి పంత్ మ్యాచ్ని గెలిపించి ఉండాల్సింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన అతను మ్యాచ్ను దాదాపు భారత్ చేతుల్లోకి తెచ్చేశాడు" అని అన్నాడు.
ఒక్క పేలవ షాట్ కారణంగా
"కానీ ఒక్క పేలవ షాట్ కారణంగా మొత్తం అతని ప్రదర్శనకే విలువ లేకుండా పోయింది. పంత్ లాంటి యువ ఆటగాడికి షాట్ల ఎంపిక విషయంలో జట్టులో ఎవరైనా తగిన సూచనలు అందించాలి. అలాంటి చెత్త షాట్లు ఆడకుండా.. స్ట్రైయిట్గా ఆడమని సూచించాలి. ప్రస్తుతం అతను మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే షాట్ ఎంపిక విధానం మార్చుకోవాలి. అదేమీ పెద్ద కష్టంతో కూడుకున్న పనేమీ కాదు" అని గంగూలీ అన్నాడు.
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా
వర్షం కారణంగా 17 ఓవర్లకి కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం భారత్కు 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఛేదనలో దినేశ్ కార్తీక్తో కలిసి రిషబ్ పంత్ (20) దూకుడుగా ఆడటంతో భారత్ 15.2 ఓవర్లు ముగిసే సమయానికి 156/4తో నిలిచింది.
10 బంతుల్లో 18 పరుగులుగా మారిన సమీకరణం
దీంతో భారత్ సమీకరణం 10 బంతుల్లో 18 పరుగులుగా మారిపోయింది. ఈ దశలో రిషబ్ పంత్ రివర్స్ షాట్ ఆడేందుకు ప్రయత్నంచి పేలవంగా బంతిని గాల్లోకి లేపేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఒత్తిడికి గురైన దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా ఆఖరి ఓవర్లో వెనువెంటనే పెవిలియన్కు చేరడంతో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.