
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాణించి టోర్నీలో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదడంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ ఫామ్ను ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగిస్తున్నాడు. వన్డే, టీ20 సిరీస్లలో తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు.
సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదిన శిఖర్ ధావన్ (52: 36 బంతుల్లో 4x4, 2x6) భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లోకి దూసుకెళ్లాడు. 98 అంతర్జాతీయ టీ20లు ఆడిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 1617 పరుగులతో ఇప్పటి వరకూ టాప్-3లో ఉండగా.. గబ్బర్ 1641 పరుగులతో తాజాగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ధావన్ 63 మ్యాచ్ల్లోనే ఈ మార్క్ని చేరుకోగా.. మహీ నాలుగో స్థానానికి పడిపోయాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను కూడా గబ్బర్ వెనక్కినెట్టాడు. రైనా టీ20ల్లో 1605 పరుగులు చేశాడు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 84 టీ20ల్లో 2843 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 108 మ్యాచ్ల్లో 2773 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా టాప్-5లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్కి ఈ ఏడాది ఆగస్టులో ధోనీ, రైనా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
2011లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన శిఖర్ ధావన్కి మొదట్లో ఎక్కువగా అవకాశాలు లభించలేదు. టాప్ బ్యాట్స్మన్ జట్టులో ఉండడంతో కీలకమైన 2014, 2016 టీ20 ప్రపంచకప్లోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్ టోర్నీలో మాత్రం మెరిశాడు. దీంతో గబ్బర్ టీ20ల్లో ప్రమాదకర ఓపెనర్గా మారాడు. గబ్బర్ టీ20ల్లో 11 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోర్ 92. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 139 వన్డేలు, 63 టీ20లు ఆడాడు. తాజా విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే కోహ్లీసేన సిరీస్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆఖరి మ్యాచ్ సిడ్నీ వేదికగానే మంగళవారం జరగనుంది.