ధావన్కు గాయం:
కొంత సమయం తర్వాత ధావన్ చేతికి కట్టుతో కనిపించాడు. బ్యాటింగ్ చేసేందుకు కూడా గబ్బర్ బరిలోకి దిగలేదు. దీంతో రోహిత్ శర్మకు జతగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. మూడు వికెట్లు పడినా కూడా ధావన్ బ్యాటింగ్కు రాలేదు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు భారత జట్టు మేనేజ్మెంట్ ధావన్కు ఎక్స్రే తీయించింది. అతని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ తెలిపింది.
కివీస్ పర్యటనకు డౌటే:
న్యూజిలాండ్తో జరిగే ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్కు శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. అయితే సోమవారం కివీస్ టూర్కు వెళ్లనున్న భారత జట్టులో ధావన్ ఉండే అవకాశం లేదు. అతడి రిపోర్ట్స్ పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోనున్నారు. సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటన కోసం సోమవారం భారత జట్టు బయలుదేరనున్న విషయం తెలిసిందే. రెండో మ్యాచ్లో కూడా ధావన్కు గాయమైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తుండగా అతడి పక్కటెముకలకు బంతి బలంగా తాకింది.
2-1తో సిరీస్ కైవసం:
గతేడాది ఆసీస్ చేతిలో సిరీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ (128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 119) సెంచరీ, విరాట్ కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లతో 89) హాఫ్ సెంచరీ చేయడంతో 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.
చెలరేగిన షమీ:
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (132 బంతుల్లో 131; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా.. మార్నస్ లబ్షేన్ (64 బంతుల్లో 54; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత పేసర్ మొహమ్మద్ షమీ 4 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి గెలిచింది. రోహిత్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.