ఆ మాటలు గుర్తు వచ్చాయి..
శార్దూల్ ఔటై డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్నప్పుడు స్టాండ్స్లోని ప్రేక్షకులతో పాటు టీమ్మేట్స్ కూడా లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. మ్యాచ్ అనంతరం జరిగిన వర్చువల్ మీటింగ్లో శార్దూల్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. 'నేను క్రీజులోకి వచ్చేసరికి టీమ్ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. క్రౌడ్ అంతా ఆసీస్ బౌలర్లను ఉత్సాహపరుస్తున్నారు. కానీ నాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు కోచ్ రవిశాస్త్రి మాటలు గుర్తువచ్చాయి. ఈ దేశంలో నువ్వు సత్తాచాటగలిగితే నీకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.
నాకు ఆ టాలెంట్ ఉంది..
ఇక్కడి ప్రజలు నీ పెర్ఫామెన్స్ చూసి నిన్ను ప్రేమిస్తారు అని కోచ్ చెప్పారు. ఆ మాటలు నా మైండ్లో ఉండిపోయాయి. అంతేకాక టీమ్కు ఉపయోగపడే పెర్ఫామెన్స్ కంటే పాజిటివ్ విషయం వేరేది ఉండదని తెలుసు. క్రౌడ్ గోల చేయడం కామన్, అదే నేను బాగా బ్యాటింగ్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేస్తూ అరుస్తారు. క్రౌడ్తో పాటు టీమ్మేట్స్ నుంచి కూడా నాకు ఆ ప్రశంస దొరికింది. నిజానికి నాలోనూ బ్యాటింగ్ టాలెంట్ ఉంది. త్రో డౌన్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నప్పుడల్లా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. ఆదివారం ఆటలో క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని భావించా. అలా ఉండగలిగితే కొన్ని రన్స్ రావడంతో పాటు ఫస్ట్ ఇన్నింగ్స్ లోటు కూడా తగ్గుతుంది.
స్లెడ్జింగ్ చేసినా..
ఇప్పటిదాకా సుందర్తో కలిసి పెద్దగా ఆడిందిలేదు. ఓ టీ20 మ్యాచ్లో ఆ తర్వాత ఓ ప్రాక్టీస్ గేమ్లో ఆడాం. కానీ ఇద్దరం సక్సెస్ అవ్వాలని గట్టిగా అనుకున్నాం. స్కోర్ బోర్డును పట్టించుకోకుండా క్రీజులో ఎక్కువ సేపు గడపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆసీస్ బౌలర్లు కొంచెం అలసిపోయారని ఇద్దరికీ తెలుసు. అందుకే కాసేపు పోరాడితే పైచేయి సాధించవచ్చని అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే బేసిక్స్కు కట్టుబడి ఆడాం. అనవసర షాట్స్ ఆడినప్పుడు ఒకరినొకరు హెచ్చరిచ్చుకున్నాం. ఆసీస్ ప్లేయర్లు స్లెడ్జింగ్కు ట్రై చేసినా, నేను వారిని పట్టించుకోకుండా నా ఆటపై దృష్టి పెట్టా'అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
భారత్ లక్ష్యం 328
33 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. భారత యువ పేసర్లు మహ్మద్ సిరాజ్(5/73), శార్దూల్ ఠాకూర్(4/61) చెలరేగడంతో 294 పరుగులకు ఆలౌటైంది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బ్యాటింగ్లో స్టీవ్ స్మిత్(55), డేవిడ్ వార్నర్(48) టాప్స్కోరర్లుగా నిలిచారు. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 369 పరుగులు చేయగా.. భారత్ 336 రన్స్కు ఆలౌటైన విషయం తెలిసిందే.