ఆసీస్ను ఓడించడం టీమిండియాకు పెద్ద సవాల్
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు పెద్ద సవాల్ అని వాట్సన్ పేర్కొన్నాడు. తాజాగా షేన్ వాట్సన్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా సొంతగడ్డపై అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఇప్పటివరకు సొంతగడ్డపై ఆసీస్ చాలా తక్కువ సార్లు ఓడిపోయింది. ఈసారి టీమిండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ, హోరాహోరీ పోరు తప్పదు" అని పేర్కొన్నాడు.
టీమిండియా ఓటమి పాలైనప్పటికీ
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారని వాట్సన్ తెలిపాడు. ఇంగ్లాండ్ పిచ్లతో పోలిస్తే.... ఆస్ట్రేలియా పిచ్లు చాలా భిన్నంగా ఉంటాయని.. అయినప్పటికీ బలమైన పేస్ అటాక్ ఉన్న టీమిండియా ఆసీస్ గడ్డపై రాణించే అవకాశం ఉందని వాట్సన్ పేర్కొన్నాడు.
భారత బౌలింగ్ లైనప్ను ఎదుర్కోవడం ఆసీస్ బ్యాట్స్మెన్కు సవాలే
జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లాంటి వైవిధ్యమైన బౌలర్లతో కూడిన భారత బౌలింగ్ లైనప్ను ఎదుర్కోవడం ఆసీస్ బ్యాట్స్మెన్కు సవాలేనని వాట్సన్ అన్నాడు. స్మిత్, వార్నర్ జట్టులో లేకపోయినప్పటికీ విజయానికి అవసరమైన పరుగులు చేయగల బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారని, ఆసీస్ బలమైన బౌలింగ్ లైనప్ కూడా ఉందని అన్నాడు.
కోహ్లీతో పాటు మిగిలిన బ్యాట్స్మెన్ కూడా మంచి ఫామ్లో
ఇక, భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన బ్యాట్స్మెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నారని వాట్సన్ తెలిపాడు. దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర టెస్టు సిరీస్ జరగనుందని షేన్ వాట్సన్ అన్నాడు. ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనలో భాగంగా డిసెంబర్ 6న ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.