
ముంబై: ముంబై: టీమిండియా క్రికెట్ అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఉత్తీర్ణత సాధించాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతో పాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. డిసెంబర్ 14న హిట్మ్యాన్ ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనున్నాడు.
ఐపీఎల్ 2020లో తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. ఈరోజు ఫిట్నెస్ టెస్ట్ పాసవడంతో ఈ నెల 14న హిట్మ్యాన్ ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు. ఆస్ట్రేలియాకు వెళ్లిన అనంతరం నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టుతో కలవాల్సి ఉంటుంది. తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్.. చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. సిడ్నీలో జనవరి 7న మొదలయ్యే మూడో టెస్టు రోహిత్ ఆడతాడు. డిసెంబర్ 19 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరగనుంది.
రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయనున్నాడు. రెండు నెలల పాటు పొట్టి ఫార్మాట్ ఆడిన రోహిత్.. టెస్టు మోడ్లోకి రావాలంటే విపరీతంగా నెట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నీటి సెలవులపై స్వదేశానికి రానున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ టీమ్లో ఉండటం టీమిండియాకు చాలా ముఖ్యం. కోహ్లీ స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
డిసెంబరు 17 నుంచి 21 వరకూ మొదటి టెస్టు జరగనుండగా.. ఆ తర్వాత డిసెంబరు 26 నుంచి 30 వరకూ రెండో టెస్టు జరగనుంది. క్వారంటైన్ నిబంధనలను సడలిస్తే.. ఈ రెండు మ్యాచ్లలో హిట్మ్యాన్ ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే మయాంక్ అగర్వాల్ టెస్టు ఓపెనర్గా ఖాయమవగా.. అతనికి జోడీగా శుభమన్ గిల్ లేదా పృథ్వీ షా తొలి రెండు టెస్టుల్లో భారత్ ఇన్నింగ్స్ని ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్ జట్టులోకి వస్తే.. గిల్, షాలపై వేటు పడనుంది.