
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్ట్లకు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోనున్నాడు. రెండో టెస్ట్లో వైస్ కెప్టెన్గా ఉన్న టెస్ట్ స్పెసలిస్ట్ చేటేశ్వర్ పుజారా స్థానంలో రోహిత్కు ఆ బాధ్యతలు ఇచ్చారు. దీంతో సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడడం లాంఛనమే అయింది. హిట్మ్యాన్ రాకతో భారత బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లేని నేపథ్యంలో మిగతా రెండు టెస్టుల్లో రోహిత్ కీలక పాత్ర పోషించనున్నాడు.
గాయం కారణంగా వన్డేలు, టీ20లతో పాటు తొలి రెండు టెస్ట్లకు దూరమైన హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని బుధవారం సాయంత్రం టీమ్తో కలిసిన విషయం తెలిసిందే. ఇక ఆలస్యం చేయకుండా గురువారం అతడు మెల్బోర్న్లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. బాక్సింగ్ డే టెస్ట్లో అద్భుత విజయం సాధించిన భారత ఆటగాళ్లు అందరూ రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ మాత్రం నెట్స్లో చెమటోడుస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆధ్వర్యంలో హిట్మ్యాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
రోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తే.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారిలో ఒకరిపై కచ్చితంగా వేటుపడనుంది. అయితే రోహిత్ ఓపెనింగ్ చేస్తాడా? లేదా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడా? అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. హిట్మ్యాన్ ఏ స్థానంలో ఆడతాడనేది జట్టు యాజమాన్యం ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఇద్దరినీ బెంచ్కు పరిమితం చేసి.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోవాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పిక్క కండరం పట్టేయడంతో ఇంటిదారి పట్టిన టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్కు చోటు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలోనే వన్డే, టీ20ల్లో ఆరంగేట్రం చేసిన నటరాజన్.. టెస్టుల్లో కూడా తొలిసారి ఆడడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక తొలి టెస్ట్లో గాయపడిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను తీసుకున్న విషయం తెలిసిందే.