
హైదరాబాద్: మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్-ధావన్ల జోడీ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (91), శిఖర్ ధావన్ (89) ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో 30 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 182 పరుగులు చేసింది. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు వంద పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పారు.
వన్డేలేల్లో వీరికి ఇది 15వ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన ఓపెనింగ్ జోడీల్లో గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ సరసన రోహిత్-ధావన్ల జోడీ నిలిచింది. వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ(21 సెంచరీ భాగస్వామ్యాలు) తొలిస్థానంలో ఉంది.

ఆ తర్వాత స్థానంలో గిల్క్రిస్ట్-మాథ్యూ హేడెన్(16 సెంచరీ భాగస్వామ్యాలు) జోడి ఉంది. నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్కు రోహిత్-ధావన్లు శుభారంభం అందించారు. తనకు బాగా అచ్చొచ్చిన మైదానంలో ఓపెనర్ శిఖర్ ధావన్ బౌండరీలతో చెలరేగుతున్నాడు.
ఈ క్రమంలో 51 బంతుల్లో 9ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ సైతం బౌండరీలతో ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో 61 బంతుల్లో వన్డేల్లో 40వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పలు రికార్డులు నమోదయ్యాయి.

వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జాబితాలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్(4,387 పరుగులు) జోడిని వెనక్కినెట్టింది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ 8, 227 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.