|
రిషబ్ పంత్ 'కిక్ అప్' విన్యాసం
రిషబ్ పంత్ కిక్ అప్ విన్యాసానికి సంబంధించిన వీడియో క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. అంతేకాదు 'నాట్ బ్యాడ్' అంటూ కామెంట్ కూడా పోస్టు చేసింది. రెండో రోజు, పంత్ తన అద్భుతమైన అథ్లెటిక్ సామర్ధ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ షాన్ మైకేల్స్ ట్రేడ్మార్క్ తరహాలో 'కిక్ అప్' విన్యాసం అభిమానులను ఆకట్టుకుంది.
తొలి భారత వికెట్ కీపర్గా పంత్ అరుదైన ఘనత
ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత జట్టులో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. దూకుడుగా ఆడిన పంత్ తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. 138 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్గా అరుదైన ఘనత సాధించాడు.
టెస్టుల్లో పంత్కు రెండో సెంచరీ
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో భారత్ వికెట్ కీపర్లు ఎవరూ టెస్ట్ సెంచరీ సాధించలేదు. తొలిసారి పంత్ ఆ ఘనత సాధించాడు. 1967 ఆస్ట్రేలియా పర్యటనలో ఫారూఖ్ ఇంజినీర్ చేసిన 89 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డుని పంత్ బద్దలు కొట్టాడు. భారత్ తరుపున ఇప్పటివరకు తొమ్మిది టెస్టులాడిన రిషబ్ పంత్కు ఇది రెండో సెంచరీ.
159 పరుగులు చేసి నాటౌట్గా
గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్లో జరిగిన మ్యాచ్లో పంత్ 114 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు జెఫ్రీ డుజాన్ తర్వాత ఇంగ్లాండ్లోనూ, ఆస్ట్రేలియాలోనూ సెంచరీలు చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు. సిడ్నీ టెస్టులో 189 బంతుల్లో 159 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.