
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లోని తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకుంటున్న వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (13)ను స్పిన్నర్ రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుత క్యాచ్ అందుకోవడంతో వేడ్ ఇన్నింగ్స్ ముగిసింది. 76.5 ఓవర్లో గాల్లోకి షాట్ ఆడిన వేడ్.. బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ఆసీస్ 232 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా తొలి సెషన్లో రెండు వికెట్లు తీశాడు.
అంతకుముందు సెంచరీ వైపు దూసుకెళ్తున్న మార్నస్ లబుషేన్ను (91: 196 బంతుల్లో) కూడా రవీంద్ర జడేజా పెవిలియన్కు పంపాడు. ఓ చక్కటి బంతికి లబుషేన్ స్లిప్లో కెప్టెన్ అజింక్య రహానేకు చిక్కాడు. 70.5 ఓవర్లో లబుషేన్ ఔట్ అయ్యాడు. దీంతో తొలి సెషన్లో ఆసీస్ కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. అయితే స్టీవ్ స్మిత్ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని అర్ధశతకం చేశాడు. స్మిత్ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు.
ఓవర్నైట్ స్కోర్ 166/2తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆపై వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన లబుషేన్ ఔట్ కావడంతో భారత్ కాస్త ఊపిరిపీల్చుకుంది. ఓవర్నైట్ స్కోర్ స్కోరుకు 40 పరుగులు జోడించిన అనంతరం లబుషేన్ ఔట్ అయ్యాడు. మరో 26 పరుగుల అనంతరం మాథ్యూ వేడ్ కూడా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్ (74), గ్రీన్ (0) ఉన్నారు.