ఫిట్గా లేడు: సిడ్నీ టెస్టుకు అశ్విన్ దూరమే!


హైదరాబాద్: ఆస్ట్రేలియాతో గురువారం నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టుకు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో తన బౌలింగ్తో భారత్కి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన అశ్విన్ ఆ తర్వాత పక్కటెముకల గాయం కారణంగా ఆ తర్వాతి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే.
దీంతో పెర్త్ టెస్టులో ఓటమిపాలైన టీమిండియా, ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే, నాలుగు టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న సిడ్నీ పిచ్ స్పిన్కి అనుకూలించనుందని వార్తలు వస్తుండటంతో జడేజాతో పాటు అశ్విన్ని ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది.

అశ్విన్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు
అయితే, అశ్విన్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని వార్తలు వస్తున్నాయి. గతేడాది సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన అశ్విన్ ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో సైతం గాయాల బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరిస్లో సైతం అశ్విన్ను గాయాలు వేధిస్తున్నాయి. దీంతో పెర్త్, మెల్బోర్న్ టెస్టులకు దూరమయ్యాడు.

నాలుగో టెస్టుకు రోహిత్ శర్మ దూరం
ఒకవేళ సిడ్నీ టెస్టుకి అతను అందుబాటులో ఉండకపోతే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలని భారత్ జట్టు యోచిస్తోంది. మరోవైపు మెల్ బోర్న్ టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ తన భార్య రితికా ఆదివారం పండంటి పాపకు జన్మనివ్వడంతో భారత్కు తిరుగుపయనమైన సంగతి తెలిసిందే.

తుది జట్టు ఎంపికపై డైలమాలో జట్టు మేనెజ్మెంట్
దీంతో రోహిత్ శర్మ స్థానంలో మిడిలార్డర్లో ఎవరిని ఆడించాలి? అనే డైలమాలో జట్టు మేనేజ్మెంట్ ఉంది. మరోవైపు రోహిత్ శర్మ స్థానంలో(మిడిలార్డర్) తిరిగి హనుమ విహారిని ఆడించాలని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. నాలుగో టెస్టులోనూ అతడ్నే ఓపెనర్గా ఆడించాలని కూడా మరికొందరు తమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు.

గురువారం నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు
దీనికి తోడు మెల్ బోర్న్ టెస్టుకు ముందు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చివరి రెండు టెస్టుల్లో విహారి ఓపెనర్గా ఆడతాడని, ఒకవేళ అతను విఫలమైనా తర్వాతి సిరీస్లో విహారిని మిడిలార్డర్లో ఆడిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు ఎంపిక చేసే తుది జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించడం తప్ప మిగతా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ సిరిస్లో చివరిదైన నాలుగు టెస్టు గురువారం నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. టెస్టు సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications