
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ మహిళల జట్టు 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2తో కోల్పోయింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీసేన 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్లో భారత మహిళా క్రికెటర్ పూజ వస్త్రాకర్ బాదిన ఓ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆమె బాదిన సిక్స్ బౌండరీ లైన్ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల కోసం పంచుకుంది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో జెస్ జోనసెన్ వేసిన బంతిని ఎదుర్కొన్న పూజ దాన్ని సిక్స్గా మలిచింది.
ఈ సిక్స్ బౌండరీ లైన్ ఆవల ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. దీంతో స్కోరు బోర్డుపై ఉన్న అంకెలు చెల్లా చెదురయ్యాయి. ఈ సంఘటన అనంతరం ఆసీస్ బౌలర్ జెస్ కూడా పూజను చూస్తూ నవ్వుకుంటూ వెళ్లింది. ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే ఇరు జట్ల మధ్య ఆదివారం జరగనుంది.