
మెల్బోర్న్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్ట్ ముగిసింది. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్డే టెస్టు ప్రారంభంకానుంది. బాక్సింగ్డే టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన ఆటగాడికి ప్రతిష్ఠాత్మక పతకం ఇవ్వనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. జానీ ముల్లఘ్ పతకాన్ని బహుకరిస్తామని సీఏ సోమవారం ట్వీట్ చేసింది.
1868లో ఆస్ట్రేలియా తొలి అంతర్జాతీయ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్కు వెళ్లిన ఆ జట్టుకు జానీ ముల్లఘ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఆ పర్యటనలో ఆయన 45 మ్యాచ్లు ఆడగా 20 సగటుతో 1698 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో 1877 ఓవర్లకు గాను 831 ఓవర్లు మెయిడిన్లు చేశాడు. 245 వికెట్లు పడగొట్టాడు. అతడి సేవలను గుర్తు చేసుకుంటూ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను ఈ విధంగా సన్మానిస్తున్నట్లు సీఏ పేర్కొంది.
అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 53 పరుగుల తేడాతో వెనుకపడిపోయినా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుంది. పేసర్లు జోష్ హాజిల్వుడ్ 5/8, పాట్ కమిన్స్ 4/21 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ 36/9కే పరిమితమైంది. చివరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. మరి రెండో టెస్టులో ఈ ఘనత సాధించి ఆ ప్రతిష్ఠాత్మక పతకం ఎవరు సాధిస్తారో చూడాలి.
పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ భారత్కు తిరిగిరానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి మూడు టెస్టులకు అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. పృథ్వీ షా విఫలమవుతుండటంతో ఓపెనర్గా శుభ్మన్ గిల్కు, కోహ్లీ గైర్హాజరీలో సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్కు అవకాశం ఇవ్వాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక కంకషన్కు గురైన సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పురోగతిని భారత్ యాజమాన్యం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. బాక్సింగ్ డే టెస్టులోపు అతడు కోలుకుంటాడని ఆశిస్తోంది. ఒకవేళ మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే హనుమ విహారి స్థానంలో జడ్డూనూ తీసుకోవడం ఖాయమే అని సమాచారం.