

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన పెర్త్ పిచ్ యావరేజిగా ఉందని ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె తన నివేదికలో పేర్కొన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ పేర్కొంది.
పెర్త్ టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా 146 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం అయింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రిఫరీ రంజన్ మదుగలే పెర్త్ స్టేడియం పిచ్, ఔట్ ఫీల్డ్ ఓ మాదిరిగా ఉందని అత్తెసరు మార్కులు ఇచ్చారు. "పెర్త్ పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయింది. దీని వల్ల బ్యాట్స్మెన్కు దెబ్బలు కూడా తగిలాయి. అదే అడిలైడ్లో జరిగిన తొలి టెస్టుకు ఉపయోగించిన పిచ్ మెరుగ్గా ఉంది" అని ముదుగలె తన నివేదికలో పేర్కొన్నారు.
మరోవైపు భారత్ గెలిచిన అడిలైడ్ ఓవల్ పిచ్కు మ్యాచ్ రిఫరీ 'చాలా బాగుంది' అనే రేటింగ్ ఇచ్చారు. భారత్-ఆసీస్ తొలి రెండు టెస్టులకు మదుగలె మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. టెస్టు మ్యాచ్కు ఆతిథ్యమిచ్చిన వేదికలకు ఈ ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రేటింగ్స్ను ఇస్తోంది.
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 26 నుంచి మూడో టెస్టు మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. ఈ టెస్టుని ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.