హైదరాబాద్: తన కెరీర్లో 50 టెస్టు మ్యాచ్లను ఆడటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ పేర్కొన్నాడు. రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఓపెనర్ మురళీ విజయ్కు 50వ టెస్టు మ్యాచ్.
ఈ సందర్భంగా మురళీ విజయ్ మీడియాతో మాట్లాడాడు. 'నిజాయితీగా చెప్పాలంటో ఇదొక గొప్ప అనుభూతి. భారత్ తరుపున ఇన్ని టెస్టు మ్యాచ్లు ఆడతానని తాను ఊహించలేదు' అని మురళీ విజయ్ బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు.
'ఇదొక గొప్ప జర్నీ. తన క్రికెట్ జర్నీలో తనకు మద్దతుగా నిలిచిన టీఎన్సీఏకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. జట్టులో చోటు దక్కించుకున్న క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇక్కడ వరకు చేరుకుంటానని ఊహించలేదు' అని తెలిపాడు.
'జట్టులో ఉన్న ప్రతి క్షణం కూడా వెలకట్టలేనిది. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు నేను ఆడిన అన్ని మ్యాచ్లు గుర్తున్నాయి. దేశం తరుపున ప్రాతినిథ్యం వహించేందుకు అందివచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నా. ఈ జర్నీ అమేజింగ్. మాటల్లో చెప్పలేను. నా డ్రీమ్లోనే ఉన్నా' అని అన్నాడు.
ఇదిలా ఉంటే రాంచీ టెస్టు ఆస్ట్రేలియాకు ఇది 800వ టెస్టు కావడం విశేషం. నాలుగు టెస్టుల మ్యాచ్ల సిరిస్లో ఇరు జట్లు ఇప్పటికే చెరో టెస్టు మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరిస్ 1-1తో సమమైంది. రాంచీ టెస్టులో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం దక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.