
ధోని నెమ్మదిగా ఆడాడన్న విమర్శలపై
ఇక, సిడ్నీ వన్డేలో ధోని మరీ నెమ్మదిగా ఆడాడన్న విమర్శలపై కూడా రోహిత్ శర్మ స్పందించాడు. "ధోని తన కెరీర్లో దాదాపు 90 స్ట్రైక్రేట్తో పరుగులు చేశాడు. తొలి వన్డేలో అతను బ్యాటింగ్కు వచ్చేటప్పటికే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పైగా ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో 100 భాగస్వామ్యం నమోదు చేయడం సులభం కాదు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

నేను కూడా వేగంగా పరుగులు చేయలేకపోయా
"క్రీజులో కుదురుకునేందుకు సమయం కావాలి. నేను కూడా వేగంగా పరుగులు చేయలేకపోయా. అప్పుడే మరో వికెట్ పడి ఉంటే పరిస్థితి ఘోరంగా ఉండేదని జాగ్రత్తగా ఆడాం. ధోని కొన్నేళ్లుగా జట్టు అవసరాలకు తగ్గట్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ధోని ఔట్ కాగానే మ్యాచ్ కఠినంగా మారుతోందని అనిపించింది" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడతాడేమో అని అనుకున్నా
"రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడతాడేమో అని అనుకున్నా. కానీ సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉన్నపుడు ఏ ఆటగాడైనా ఒత్తిడికి గురి కావడం మామూలే" అని రోహిత్ అన్నాడు. 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.

వన్డేల్లో 22వ సెంచరీని నమోదు చేసిన రోహిత్
రోహిత్ శర్మ (133; 129 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులు) అద్భుత పోరాటంతో రేసులోకి తీసుకొచ్చినప్పటికీ, మిగతా బ్యాట్స్మెన్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంతో టీమిండియా ఓటమి పాలైంది. ధోనీతో కలిసి నాలుగో వికెట్కు 137 పరుగులు జోడించిన రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి విజయం కోసం పోరాడాడు. ఓ ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ... ఆచితూచి ఆడుతూ పరుగుల వరద పారించాడు. వరుసగా పదో సిరీస్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ వన్డేల్లో 22వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












