
సిడ్నీ: భారత క్రికెట్ అభిమానులకు చేదువార్త. గాయం కారణంగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా సిరీస్కు పూర్తిగా దూరం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతి షమీ మణికట్టుకు బలంగా తాకింది. దీంతో షమీ విపరీతమైన నొప్పితో విలవిలలాడాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ కూడా చేయలేదు. అయితే స్కానింగ్లో షమీ మణికట్టులో పగుళ్లు వచ్చినట్లు సమాచారం.
గాయం నుంచి మహ్మద్ షమీ కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని సమాచారం. విరాట్ కోహ్లీతో కలిసి షమీ కూడా స్వదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పితృత్వ సెలవులపై కోహ్లీ భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ ఒకే విమానంలో ఇండియా రానున్నారు. ఇప్పటికే తొలి ఓడిన టీమిండియాకు.. మిగతా మూడు టెస్టులకు షమీ లేకపోవడం లోటే. ఇప్పటికే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ దూరమయ్యాడు. ఈ సమయంలో అనుభవజ్ఞుడు షమీ కూడా అందుబాటులో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది.
అయితే మహ్మద్ షమీ స్థానంలో టీ నటరాజన్, శార్దూల్ ఠాకూర్లో ఒకరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపికైన వారిద్దరు బ్యాకప్ ప్లేయర్లుగా జట్టుతోనే ఉన్నారు. వారితో పాటు కార్తిక్ త్యాగి కూడా నెట్బౌలర్గా ఉన్నాడు. నవ్దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ కూడా అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20ల్లో రాణించిన నటరాజన్.. టెస్ట్ల్లోనూ అదరగొట్టగలడని టీమ్మేనేజ్ భావిస్తోంది. అతడికే అవకాశం దక్కనుంది. అయితే షమీ గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వన్డే సిరీస్ తర్వాతే భారత్కు రావాల్సిన నటరాజన్ను బీసీసీఐ ముందు జాగ్రత్తగా ఆస్ట్రేలియాలోనే ఉంచింది. ఏ ఆటగాడైన గాయపడితే ఆ స్థానంలో భర్తీ చేసుందుకు, అలాగే నెట్ బౌలర్గా వాడుకునేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా షమీ గాయపడటంతో అతని స్థానంలో బరిలోకి దిగేందుకు నటరాజన్కు మార్గం సుగుమమైంది.
ఇతర ప్లేయర్లకు గాయం కావడం వల్లే నటరాజన్ వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక టెస్ట్ల్లో కూడా అరంగేట్రం చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు తొడకండరాల గాయం, కంకషన్తో తొలి టెస్టుకు దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.