హైదరాబాద్: ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరిస్లో భాగంగా జరిగే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నాడు. కాలుకి గాయం అవడంతో మిచెల్ స్టార్క్ మిగతా రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు ఆసీస్ ఫిజియోథెరపిస్టు డేవిడ్ తెలిపారు.
'బెంగుళూరులో జరిగిన రెండో టెస్టులో స్టార్క్ కుడి కాలికి గాయమైంది. ఆ టెస్టు మ్యాచ్ లో స్టార్క్ కుడి కాలు స్వల్పంగా చిట్లడంతో విపరీతమైన బాధతో సతమతమయ్యాడు. అతని కాలుకు తీయించిన స్కానింగ్ లో కొద్దిపాటి పగులు వచ్చినట్లు తేలింది. దాంతో అతను స్వదేశానికి వెళ్లక తప్పడం లేదు. అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. స్టార్క్ జట్టుకు దూరం కావడం నిజంగా మా దురదృష్టం. టెస్టు సిరీస్ కు స్టార్క్ పూర్తిగా అందుబాటులో ఉంటాడని తొలుత భావించినా అలా జరగలేదు.' అని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ భుజం గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేందుకు మార్ష్ స్వదేశానికి తిరిగిరానున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరిస్ 1-1తో సమమైంది. ఈ సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 16నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఇక నాలుగో టెస్టు ధర్మశాలలో జరగనుంది.