మొహాలీ: ఆస్ట్రేలియా - భారత్ మధ్య రసవత్తరమైన పోరుకు ముందు భారత స్టార్ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీ ఆసిస్ పైన మైండ్గేమ్ ప్రారంభించాడు. క్రికెట్లో ప్రత్యర్థి జట్లలోని ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా, మైదానంలో వారిని ఉడికిస్తూ, నోరు పారేసుకునే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ముందుంటుంది.
గతంలో భారత్-ఆస్ట్రేలియాలు తలపడుతున్న సమయంలో స్లెడ్జింగ్ను వాడి కొన్నిసార్లు విజయవంతమైన ఆసీస్ ఆటగాళ్లు, ఆదివారం జరిగే పోరులో సైతం అదే దారిలో వెళ్లవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ సమయంలో కోహ్లీ వారికన్నా ముందే మైండ్ గేమ్ ప్రారంభించాడు.
స్లెడ్జింగ్ పరిస్థితి నాకు ఎన్నోమార్లు ఎదురైందని, వారు ఎన్ని మాటలు అన్నా మైదానంలో నా మనసులో అలజడి సృష్టించలేరని, ఎవరైనా ఏదైనా అంటే వెంటనే నా నుంచి సమాధానం వస్తుందని, అది ఆ క్షణాన నా ఆటతీరును ప్రభావితం చేయబోదని చెప్పాడు.

ఒకరిని ఒకరు దూషించుకునే అవసరం లేకుండా ఆటాడాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఒకవేళ ఆలాంటి పరిస్థితే వస్తే మాటకు మాటే సమాధానమవుతుందని అన్నాడు.
కోహ్లీ వ్యాఖ్యలపై మిచెల్ జాన్సన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించాడు. కోహ్లీకి ఘాటుగా సమాధానం చెప్పాడు.
గత ఏడాది ప్రపంచ కప్ సెమీ ఫైనల్ సమయంలో కోహ్లీ వికెట్ను మిచెల్ జాన్సన్ తీశాడు. ఇప్పుడు అతను మాజీ ఆటగాడు. అయితే, కోహ్లీ వ్యాఖ్యలపై ట్విట్టర్లో స్పందించాడు. కోహ్లీ ఒత్తిడిలో అప్పుడు అవుటయ్యాని అభిప్రాయపడ్డాడు. 2014-15లో జరిగిన మ్యాచ్లో కోహ్లీ, మిచెల్ మాటల యుద్ధానికి దిగారు.