|
443/7 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన కోహ్లీ
ఆటలో భాగంగా రెండో రోజైన గురువారం ఓవర్నైట్ స్కోరు 215/2తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియా పుజారా (106: 319 బంతుల్లో 10ఫోర్లు), విరాట్ కోహ్లీ (82: 204 బంతుల్లో 9 ఫోర్లు), రోహిత్ శర్మ (63 నాటౌట్: 114 బంతుల్లో 5 ఫోర్లు) అద్భుత ప్రదర్శన చేశారు. జట్టు స్కోరు 443 పరుగుల వద్ద జడేజా (4) ఔట్ కాగనే భారత్ ఇన్నింగ్స్ని కోహ్లీ డిక్లేర్ చేశాడు.
|
ఆసీస్ బౌలర్లను సమర్థంగా
తొలిరోజు చివరి సెషన్లో ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న పుజారా-కోహ్లీ జోడీ రెండో రోజైన గురువారం తొలి సెషన్లో కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పుజారా మరోసారి టెస్టుల్లో సత్తా చాటాడు. చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మరోవైపు కోహ్లీ వేగంగా ఆడకపోయినా.. పుజారాకి సహకారం అందిస్తూ హాఫ్ సెంచరీని సాధించాడు.
|
ఆసీస్పై పుజారాకు ఇది నాలుగో సెంచరీ
ఇన్నింగ్స్ 114వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్లో బౌండరీ బాదిన పుజారా కెరీర్లో 17వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆసీస్పై పుజారాకు ఇది నాలుగో సెంచరీ. ఈ సిరీస్లో పుజారాకి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ పుజారా సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
|
టెస్టుల్లో రోహిత్ శర్మ 10వ హాఫ్ సెంచరీ
రహానే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (63 నాటౌట్)ను ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ సహనంతో ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహత్ శర్మకు ఇది 10వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (39), జడేజా (4) వెనువెంటనే ఔట్ కావడంతో కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ను 443 పరుగుల డిక్లేర్ చేశాడు.