హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన శిఖర్ ధావన్ భారీ షాట్కు ప్రయత్నించి స్టాన్లేక్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచీ ధావన్ దూకుడుగా ఆడుతున్నప్పటికీ, మిగతా బ్యాట్స్మన్ నుంచి సరైన సహకారం అతడికి అందలేదు. దీంతో చివర్లో ఒత్తిడికి లోనైన ధావన్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర బెహ్రెన్డార్ఫ్కు క్యాచ్ ఇచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 150/4తో నిలిచింది.
దీంతో చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమయ్యాయి. ప్రస్తుతం క్రీజులో దినేశ్ కార్తీక్ (21), రిషబ్ పంత్(20) పరుగులతో ఉన్నారు. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. అంతకముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగి నిరాశపరిచాడు.
వరుణుడు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 174 పరుగులుగా సవరించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో మ్యాక్స్వెల్ 24 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.