
కీపర్గా సత్తాచాటాడు:
మూడో మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'ఆసీస్ సిరీస్లో వచ్చిన ప్రతీ అవకాశాన్నిరాహుల్ వినియోగించుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుతో పాటు కీపర్గా కూడా సత్తాచాటాడు. రాహుల్ కీపింగ్ బాధ్యతలతో అదనంగా మరొక బ్యాట్స్మన్ను తీసుకోవచ్చు. దాంతో మన బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. రాహుల్ జట్టులో మంచి బ్యాలెన్స్ తెచ్చాడు' అని అన్నాడు.

కీపర్గా రాహుల్ కొనసాగుతాడు:
'రాహుల్ బ్యాటింగ్లో, కీపర్గా కూడా ఆకట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో కీపర్గా రాహుల్ను తప్పించాల్సిన అవసరం కనిపించడం లేదు. ఆసీస్తో ఆడిన భారత ఎలెవన్ను మార్చాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. 2003 వరల్డ్కప్లో రాహుల్ ద్రవిడ్ కీపింగ్ చేసారు. దాంతో జట్టులో సమతుల్యత వచ్చింది. అదనంగా బ్యాట్స్మన్ ఉండటం వల్ల మరింత ఆత్మవిశ్వాసంతో ఆడతాం. కీపర్గా రాహుల్ కొనసాగుతాడు. ఇది జట్టును ఎక్కడికి తీసుకెళుతుందో చూడాలి' అని కోహ్లీ తెలిపాడు.

మంచి క్రికెట్ షాట్లు ఆడాడు:
'రాహుల్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడడు. కానీ.. రెండో వన్డేలో ఏవిధంగా చెలరేగాడో అందరం చూసాం. మంచి క్రికెట్ షాట్లు ఆడాడు. గేమ్ ప్లాన్ ప్రకారం బ్యాట్ జుళిపిస్తాడు. అతనికి ఆటపై అవగాహన ఉండడం కలిసొస్తోంది. గత ఐదు ఆరు నెలల్లో మంచి క్రికెట్ ఆడాడు. ఇది జట్టుకు పెద్ద సానుకూలాంశం. రాహుల్ ఇలాగే ఆడాలని కోరుకుంటున్నా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కన్కషన్కు గురైన పంత్:
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంటూ వచ్చిన రిషభ్ పంత్ గత కొంత కాలంగా పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక గతేడాది డిసెంబర్ నెల చివరలో విండీస్తో జరిగిన టీ20లలో మెరుపులు మెరిపించి ఫామ్లోకి వచ్చాడు. అయితే ఆసీస్ సిరీస్లో భాగంగా జరిగిన ముంబై వన్డేలో పంత్ కన్కషన్కు గురయ్యాడు. దీంతో ఆ వన్డేలో రాహుల్ కీపింగ్ చేసి ఆకట్టుకున్నాడు.

సిరీస్ విజయంలో కీలక పాత్ర:
ఆసీస్తో మూడో వన్డే నాటికి గాయం నుంచి పంత్ తేరుకున్నప్పటికీ అతన్ని తుది జట్టులో వేసుకోలేదు. కీపర్గా రాహుల్పై కోహ్లీ నమ్మకం ఉంచాడు. కీలక స్టంపౌట్లతో పాటు అద్భుతంగా క్యాచ్లు అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇక బ్యాటింగ్లో కూడా సత్తాచాటాడు. మొదటి వన్డేలో 47, రెండో వన్డేలో 80, మూడో వన్డేలో 19 పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications












