
రాహుల్ ఔట్
టెస్ట్ సిరీస్ నుంచి ఇప్పటికే కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ జట్టుకు దూరమైన ప్రతికూలతల్లో.. కేఎల్ రాహుల్ కూడా దూరమవ్వడం టీమిండియాను కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాతో ఇంకా రెండు టెస్టులు జరగాల్సి ఉన్నది. అయితే ప్రాక్టీస్లో రాహుల్కు శనివారమే గాయమైందని, కోలుకోవడానికి మరో మూడు వారాలు పడుతుందని బీసీసీఐ తెలిపింది. గాయం చికిత్స కోసం త్వరలోనే అతను భారత్కు వస్తున్నాడు. బెంగుళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ఉండనున్నాడు.

ఎడమచేతి మణికట్టుకి గాయం
'మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఎడమచేతి మణికట్టు బెణికింది. గాయం కారణంగా వికెట్కీపర్-బ్యాట్స్మన్ రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలోని చివరి రెండు టెస్టులకు దూరమవుతున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి అతడికి మూడు వారాల సమయం పడుతుంది. రాహుల్ త్వరలనే భారత్కు తిరిగివెళ్లనున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చేరుతాడు' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

రెండు టెస్టుల్లో బెంచ్కే
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లో కేఎల్ రాహుల్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి చోటు దక్కలేదు. జట్టులో విపరీతమైన పోటీ ఉండడంతో బెంచ్కే పరిమితమయ్యాడు. ఎంతో ప్రతిభ ఉన్న రాహుల్ను బెంచ్కే పరిమితం చేయడంపై మాజీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. రెండు టెస్టుల్లో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా విఫలమవ్వడంతో.. మూడో టెస్టులో రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. ఓపెనర్గా కాకున్నా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా అయినా ఆడుతాడు అనుకున్నారు. కానీ గాయం రూపంలో అతడిని విధి వక్రీకరించింది.

టీమిండియాను కలవరపెడుతున్న గాయాలు
టెస్ట్ సిరీస్లోనే గాయపడి ఇప్పటికే మొహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ స్వదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన భార్య అనుష్క శర్మ మరికొద్ది రోజుల్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఆసీస్ పర్యటనలో గాయాలు టీమిండియాను కలవరపెడుతున్నాయి. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆసీస్ మూడో టెస్టు ప్రారంభం కానుంది. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు జరుగనుంది.


Click it and Unblock the Notifications












