హైదరాబాద్: ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులతో పాటు జట్టు సహచర ఆటగాళ్ల మనసుని గెలుచుకున్నాడు. రాంచీ టెస్టులో భుజం నొప్పి గాయం కారణంగా చివరి టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడు.
2011 నవంబర్ నుంచి 54 టెస్టుల తర్వాత కోహ్లీ లేకుండా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ధర్మశాల టెస్టుకు కోహ్లీ దూరం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలను రహానేకి అప్పగించారు. చివరి టెస్టుకు కోహ్లీ దూరమైనా మైదానంలో 'డ్రింక్స్ బాయ్' అవతారం హల్ చల్ చేశాడు.

సాధారణంగా రిజర్వ్ బెంచ్లో ఉన్న ఆటగాళ్లు మ్యాచ్ సమయంలో సహచర ఆటగాళ్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకుని వస్తుంటారు. కెప్టెన్ లేదా కీలక ఆటగాళ్లు ఇలా తీసుకురావడం అరుదు. డ్రింక్స్ బాయ్గా మైదానంలో కోహ్లీ కనిపించగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా గంటలోనే భారీ స్పందన వచ్చింది. విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూ నెటిజెన్లు కామెంట్లు చేశారు. ఓ వైపు విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అదే సమయంలో కామెంటేటర్లు కూడా హర్షం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ 'భారత ఆటగాళ్ల కోసం ఎవరు మంచి నీళ్లు తీసుకుని వచ్చారో చూడండి... 12వ ఆటగాడు విరాట్ కోహ్లీ' అని కామెంట్ చేశారు. అలాగే మాజీ క్రికెటర్, కామెంటేటర్ బ్రెట్ లీ కూడా ప్రపంచంలో కోహ్లీ చాలా ఖరీదైన డ్రింక్స్ బాయ్ అని కామెంట్ చేశాడు.