స్వదేశంలో టీమిండియా అద్భుత రికార్డు
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలై 0-1తో భారత్ వెనుకబడినా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న తీరు అద్భుతం. బెంగుళూరులో టెస్టులో విజయం సాధించి సిరిస్ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత రాంచీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నిర్ణయాత్మకంగా మారిన ధర్మశాల టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టెస్టు హోదా కలిగిన అన్ని జట్లపై భారత్ విజయం
ప్రపంచ క్రికెట్లో టెస్టు హోదా కలిగిన అన్ని జట్లపై టీమిండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ గుర్తింపు పొందింది.
స్వదేశంలో ఆసీస్పై భారత్ అరుదైన రికార్డు
తాజా విజయంతో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీమిండియా వరుసగా నాలుగో టెస్టు సిరిస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2004-2005లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ప్రతి టెస్టు సిరిస్లో టీమిండియా విజయం సాధించింది.
ఆసియాలో ఆసీస్ చెత్త ప్రదర్శన
ఉపఖండంలో ఆస్ట్రేలియా మరోసారి చెత్త ప్రదర్శన చేసింది. తాజాగా భారత్ చేతిలో 2-1తో సిరిస్ ఓటమి పాలవడంతో ఉపఖండంలో ఆస్ట్రేలియా రాణించలేదని మరోసారి రుజువైంది. ఉపఖండంలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగు టెస్టు సిరిస్ ఓటమి. 2012-2013లో భారత్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014-15లో పాక్ చేతిలో ఓటమి, 2016లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది.
భారత్ పిచ్లు టీమిండియాకు స్వర్గధామాలు
ఆస్ట్రేలియాపై తాజా విజయంతో ఒక సీజన్లో 10 టెస్టు విజయాలను సొంతం చేసుకున్న జట్టుగా టీమిండియా అవతరించింది. అంతకముందు ఈ ఘనతను ఆస్ట్రేలియా రెండు సార్లు సాధించింది. 2005-06 సీజన్లో 11 విజయాలు, 1999-2000 సీజన్లో 10 విజయాలను ఆసీస్ సాధించింది.
ఉమేశ్ యాదవ్ అద్ఫుత ప్రదర్శన
ఈ సిరిస్లో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మొత్తం 15 వికెట్లను అతను తీయడం గమనార్హం.. ఆసీస్తో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఉమేశ్ యాదవ్ 17 వికెట్లు తీసుకున్నాడు. విదర్భకు చెందిన ఉమేశ్ యాదవ్ ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో మూడు వికెట్లు తీశాడు. అంతకముందు 2012-13లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఉమేశ్ యాదవ్ అత్యధికంగా ఓ సిరిస్లో 14 వికెట్లు తీసుకున్నాడు.
కోహ్లీ రికార్డుని సమం చేసిన జడేజా
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడినా తిరిగి పుంజుకుని సిరీస్ను 2-1తో దక్కించుకోవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఈ సిరిస్లో మొత్తం 25 వికెట్లు తీసిన జడేజా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. ఇక పూణె టెస్టులో ఐదు వికెట్లు, బెంగళూరులో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి ఆసీస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక డ్రాగా ముగిసిన రాంచీ టెస్టులో జడేజా 9 వికెట్లు తీసి తన విశ్వరూపం ప్రదర్శించాడు. హోం సీజన్లో కోహ్లీ మూడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. తాజా టెస్టులో జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోవడంతో కోహ్లీ రికార్డుని జడేజా సమం చేశాడు.
స్టెయిన్ రికార్డుని బద్దలు కొట్టిన అశ్విన్
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు సిరిస్లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ నిలిచాడు. 2007-08 సీజన్లో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ తీసుకున్న 78 వికెట్లు రికార్డుని అశ్విన్ ధర్మశాల టెస్టులో అధిగమించాడు.
తొలిసారి డకౌట్ అయిన పుజారా
పుజారా ఇంతవరకూ స్వదేశంలో 50 ఇన్నింగ్స్ లు ఆడగా, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో తొలిసారిగా డక్కౌట్ అయ్యాడు. విదేశాల్లో 31 ఇన్నింగ్స్లు ఆడిన పుజారా ఖాతాలో మరో రెండు డకౌట్లు ఉన్నాయి. 2016-17 సీజన్లో కోహ్లీ, విజయ్, జడేజాలు ఆరు సార్లు, రాహుల్ 7 సార్లు 50కి పైగా పరుగులు సాధించారు. పుజారా మాత్రం 12 హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం.
2000 తర్వాత ఇదే తొలిసారి
ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత బౌలర్లు మూడు కన్నా ఎక్కువ వికెట్లను తీయడం 2000 తరువాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్ లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ తరువాత, ముగ్గురు బౌలర్లు సత్తా చాటడం ధర్మశాలలోనే జరిగింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ యావరేజ్ కేవలం 24.12 మాత్రమే. ఇది అతని క్రికెట్ చరిత్రలో అతి తక్కువ యావరేజ్ స్కోర్లలో మూడవది.
500 పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన ఘనత
500 పరుగులు చేయడంతో పాటు ఓ సీజన్లో 50 వికెట్లు సాధించిన ఘనత ఈ సిరీస్తో జడేజాకు దక్కింది. 1979-80లో కపిల్ దేవ్, 2008-09లో మిచెల్ జాన్సన్ సాధించిన ఈ ఘనతను ఇప్పుడు జడేజా కూడా సాధించాడు.