హైదరాబాద్: వన్డేల్లో తన బ్యాటింగ్ స్థానం ఇంకా ముందుకు జరిపితే బాగుంటుందని బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్వెల్ అన్నాడు. టీ20ల్లో మాదిరిగా వన్డేల్లో ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో దూకుడుగా ఆడటం కష్టమని మ్యాక్స్వెల్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా చేతిలో ఓటమి: జట్టు ఎంపికపై మాజీలు తీవ్ర విమర్శలు
బుధవారంతో ముగిసిన రెండు టీ20ల సిరిస్లో ఆస్ట్రేలియా సిరిస్ నెగ్గడంలో మ్యాక్స్వెల్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్వెల్, రెండో టీ20లో 113 నాటౌట్ పరుగులతో నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నాడు.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం ఉప్పల్ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాక్స్వెల్ మాట్లాడుతూ "వన్డే క్రికెట్లో చివర్లో వచ్చి ఆడటం కష్టం. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రావడం బాగుంటుంది. ఇది నాలుగు, ఐదు స్థానాలపై ఆధారపడి ఉంటుంది" అని అన్నాడు.
"అలాంటి అవకాశం వస్తే ఆనందంగా స్వీకరిస్తా. టీమిండియాపై రెండో టీ20లో దాదాపు 15 ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్కు వచ్చా. 6, 7 స్థానాల్లో నేను 80 లేదా 100 పరుగులు చేస్తున్నప్పుడు ఇబ్బంది లేదు. రెండో టీ20లో బంతుల్ని చక్కగా ఎంపిక చేసుకొని బాదాను. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకొని ఫీల్డర్లు లేని చోటికి బంతిని పంపించా" అని మ్యాక్స్వెల్ అన్నాడు.