
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా సిరీస్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ సారథ్యంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ తనకు ఏం అర్థం కావడం లేదని, భారత ప్రధాన బౌలర్ల సేవలను విరాట్ సరిగ్గా వాడుకోవడం లేదన్నాడు. రెండు రోజులు తిరిగేసరికి.. తిట్టిన నోటితోనే కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు గౌతీ.
గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తోన్న గౌతమ్ గంభీర్.. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేలకుపైగా పరుగులు పూర్తి చేసినందుకు భారత కెప్టెన్పై ప్రశంసలు గుప్పించాడు. కోహ్లీకి హ్యాట్సాఫ్ చెప్పిన గంభీర్.. బాగా ఆడి జట్టు విజయం సాధిస్తే వచ్చే కిక్కే వేరన్నాడు. 'నీవు ఏది అనుకుంటావో అదే పొందగలవు. నువ్వేదైనా చేయగలవు. జట్టు గెలవడానికి అవసరమైన చివరి పరుగు చేసి హోటల్కు తిరిగొచ్చాక దేశం కోసం ఏదో చేశానని నీకు అప్పగించిన బాధ్యతపై నీవు చాలా సంతృప్తిగా ఉంటావు. కోహ్లీ సాధించిన వేల పరుగులు, సెంచరీలకు హాట్సాఫ్' అని గంభీర్ ప్రశంసించాడు.
వన్డే సిరీస్లో కింగ్ విరాట్ కోహ్లీ రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. తొలి వన్డే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 22వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఇక మూడో వన్డేలో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మూడో వన్డేలో 63 పరుగులతో రాణించిన కోహ్లీ వన్డే సిరీస్లో మొత్తంగా 173 పరుగులు చేశాడు.
టీమిండియా మాజీ ఆటగాడు, టెస్ట్ స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్.. విరాట్ కోహ్లీ సాధించిన రికార్డుపై హర్షం వ్యక్తం చేశాడు. 'నాకు తెలిసినంతవరకు ఒక ఆటగాడు ఇన్నేళ్ల కెరీర్లో ఒకే ఇంటన్సిటీతో పరుగులు సాధించడమనేది ఇప్పుడే చూస్తున్నా. అది మన కోహ్లీ కావడం గర్వించదగ్గాల్సిన విషయం. కోహ్లీ కెరీర్ మొదట్లో ఆడిన తీరు గమనిస్తే.. వేగంగా పరుగులు చేయడానికే బరిలోకి దిగినట్లు కనిపించేవాడు. కెరీర్ ఆరంభం కాబట్టి అలా ఉండడం సహజం.. కెరీర్ సాగుతున్న అతని వేగం ఆగిపోతుందని భావించా. కానీ అలా జరగలేదు. ఇన్నేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా అతని ఎనర్జీ లెవెల్స్లో డ్రాప్ కనిపించకపోవడం విశేషం. అది బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఏదైనా సరే పాదరసంలా కదులుతుంటాడు. కోహ్లి చేసిన 42 సెంచరీల్లో 26 సెంచరీలు చేజింగ్లో రావడం గొప్ప విషయం' అని లక్ష్మణ్ అన్నాడు.