సిడ్నీ: మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్పై సునాయాస విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 8 వికెట్లకు 308 పరుగులకే పరిమితమైంది. హార్దిక్ పాండ్యా (76 బంతుల్లో 90; 7ఫోర్లు, 4సిక్స్లు), శిఖర్ ధావన్ (86 బంతుల్లో 74; 10ఫోర్లు) పోరాడినా.. మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ ఓటమితో విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్గా ఓ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. విరాట్ సారథ్యంలోని భారత జట్టు వరుసగా నాలుగు వన్డేల్లో ఓటమిపాలైంది.
ఈ ఏడాది ఆరంభంలో మూడు వన్డేల సిరీస్లో భారత్ను న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ఇప్పుడు ఆసీస్ చేతిలో ఓటమిపాలవడం ద్వారా టీమిండియాకు వరుసగా నాలుగో ఓటమి ఎదురైంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు వరుసగా నాలుగు వన్డేల్లో ఓడటం ఇదే ప్రథమం. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో టీమిండియా 2015-16లో వరుసగా ఐదు వన్డేల్లో ఓడింది. అందులో ఒకటి దక్షిణాఫ్రికా చేతిలో కాగా.. మిగతా నాలుగు ఆసీస్ చేతిలో. ఇక రెండో వన్డేలోనూ భారత్ ఓడితే.. ధోనీ సరసన విరాట్ చేరతాడు.
అయితే ఇక్కడ ఓ అనుకూల రికార్డు కూడా విరాట్ కోహ్లీకి ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు రెండో వన్డేలో మాత్రం ఇప్పటివరకు ఓడిపోలేదు. 2017 పర్యటనలో ఒకసారి, 2019లో రెండు సార్లు, 2020లో ఓసారి టీమిండియానే గెలిచింది. ఇప్పడు కూడా భారత్ గెలుస్తుందని రికార్డులు చెపుతున్నాయి. ఆదివారం రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. మరి ఈ వన్డేలో కోహ్లీ తన రికార్డును కాపాడుకుంటాడో లేదో చూడాలి.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా ప్లేయర్స్కు జరిమానా విధించారు. ఒక్కో ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడనుంది. దీనిపై అధికారికంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని, కెప్టెన్ విరాట్ కోహ్లి తన తప్పును ఒప్పుకున్నాడని శనివారం ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. టీమిండియా నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేసింది.
హ్యాండ్స్ ఆఫ్ గాడ్స్.. మారడోనా జెర్సీ ధర ఎంతో తెలుసా!!