కోహ్లీ మాట్లాడుతూ
కోహ్లీ మాట్లాడుతూ "ఏ ఆస్ట్రేలియా జట్టైనా స్వదేశంలో బలహీనం కాదనేది నా అభిప్రాయం. ప్రస్తుత జట్టు బలంగా లేదని అనుకోలేం. నైపుణ్యం గల ఆటగాళ్లు ఇంకా ఆ జట్టులో ఉన్నారు. ఇప్పటికీ వారు ప్రత్యర్థి జట్లపై స్వదేశంలో ఆధిపత్యం ప్రదర్శించగలరు" అని పేర్కొన్నాడు.
అడిలైడ్లో కోహ్లీ మెరుగైన రికార్డు
తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న అడిలైడ్ స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ సగటుకు దాదాపు సమానంగా అడిలైడ్లో కోహ్లి యావరేజ్ ఉండటం విశేషం. ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 98.50 సగటుతో 394 పరుగులు చేశాడు.
అడిలైడ్ మైదానం గురించి మాట్లాడుతూ
ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడిలైడ్ మైదానం గురించి మాట్లాడుతూ "నాకు ఈ గ్రౌండ్, నగరం అంటే చాలా ఇష్టం. ఒక మైదానంలో కొన్ని సార్లు బాగా ఆడినంత మాత్రాన, ప్రతిసారి అదే ప్రదర్శన చేయలేకపోవచ్చు" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఆసీస్ గడ్డపై ఒక్క టెస్టు సిరిస్ను గెలవని టీమిండియా
గత 40 ఏళ్లలో అనేకసార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరిస్ను గెలవలేదు. అయితే, మునుపటితో పోలిస్తే టీమిండియా బలంగా ఉండటంతో పాటు ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు బాల టాంపరింగ్ కారణంగా జట్టుకు దూరం కావడంతో బలహీనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా టెస్టు సిరిస్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోంది.