హైదరాబాద్: ఆసీస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడేందుకు వంద శాతం ప్రయత్నిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా రెండో టీ20 కోసం ఇరు జట్లు ఇప్పటికే గౌహతికి చేరుకున్నాయి. రెండో టీ20 నేపథ్యంలో డేవిడ్ వార్నర్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.
'వరుస ఓటముల గురించి మేము ఏమాత్రం ఆలోచించడంలేదు. త్వరలో ఆసీస్ బ్రాండ్ క్రికెట్ ఆడేందుకు వంద శాతం ప్రయత్నిస్తాం. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడం, భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమవ్వడంతో కొంత ఒత్తిడికి గురవుతున్నాం' అని డేవిడ్ వార్నర్ తెలిపాడు.
'ఈ విషయంపై ఎక్కువ ఆలోచించడం లేదు. అయినా సరే ఓటముల నుంచి బయటికి రాలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ ఒత్తిడి, బ్యాట్స్మెన్ల వైఫల్యం గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ప్రతి మ్యాచ్లో గెలవాలనే బరిలోకి దిగుతున్నాం. కానీ, ఓడిపోతున్నాం' అని వార్నర్ అన్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న సిరిస్లో ఒక్క మ్యాచ్లో విజయం సాధిస్తే చాలు ఆతిథ్య జట్టుకు సవాల్ విసరొచ్చని వార్నర్ పేర్కొన్నాడు. 'రెండో టీ20లో మా సామర్థ్యం మేరకు ఆడతాం. భుజం గాయంతో స్మిత్ టీ20 సిరీస్కు దూరమయ్యాడు. దీంతో నేను సారథ్య బాధ్యతలు అందుకున్నాను. నా అనుభవంతో జట్టును నడిపిస్తాను' అని వార్నర్ అన్నాడు.
కోహ్లీ సేనను సొంతగడ్డపై ఓడించడం కాస్తంత కష్టమే అయినప్పటికీ, ప్రయత్నిస్తామని డేవిడ్ వార్నర్ తెలిపాడు. నవంబర్లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల యాషెస్ సిరిస్పై కూడా వార్నర్ ఈ సందర్భంగా స్పందించాడు. ప్రస్తుత తరుణంలో యాషెస్ సిరిస్ గురించి ఎంత మాత్రం ఆలోచించడం లేదని వార్నర్ అన్నాడు. ప్రస్తుతం దృష్టంతా గౌహతి టీ20పైనే ఉందని చెప్పాడు.