
సిడ్నీ: ప్రతి బంతిని బౌండరీకి తరలించడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయత్నిస్తాడని ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెహమన్ అన్నాడు. గొప్ప ఆటగాళ్లలో ప్రత్యేకత ఇదేనని పేర్కొన్నాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా సిడ్నీ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన నేపథ్యంలో మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
తాజాగా డారెన్ లెహమన్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ శక్తినంతా ఉపయోగించి ఆడతాడు. ఓటమిని అస్సలు ఇష్టపడడు. మ్యాచ్ చివరిదాకా పోరాడతాడు. విరాట్ ప్రతి బంతి బౌండరీ లక్ష్యంగా ఆడుతాడు. గొప్ప ఆటగాళ్లలో ప్రత్యేకత అదే. అలాగే కోహ్లీ ప్రతి మ్యాచ్ విజయం సాధించడానికే బరిలోకి దిగుతాడు. 2017లో ఆడిన తీరు దీనికి ఉదాహరణ' అని తెలిపాడు. లెహమన్ ఆసీస్ తరఫున 27 టెస్టులు, 117 వన్డేలు ఆడాడు.
ఆసీస్ మాజీ ఆటగాడు గ్రెగ్ ఛాపెల్ కూడా విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ, ప్రభావవంతమైన ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. అతడు బలమైన అభిప్రాయలు కలిగి ఉన్నాడు. వాటిని అతడు తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. తనలో ఉత్తమ ఆటను కోహ్లీ వెలికితీస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.. మరిన్ని కూడా సాధిస్తాడు' అని ఛాపెల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సిడ్నీలో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ సాధన చేస్తున్నాడు.
క్వారంటైన్ను ఎంతో ఆస్వాదిస్తున్నట్లు విరాట్ కోహ్లీ ట్విటర్ ద్వారా తెలిపాడు. 'క్వారంటైన్ డైరీస్. ఇస్త్రీ లేని టీషర్ట్, సౌకర్యవంతమైన మంచం, చూడటానికి మంచి సినిమా.. సూపర్' అంటూ ఉల్లాసంగా ఉన్న తన ఫొటోని మంగళవారం పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన నెట్ఫ్లిక్స్ ఇండియా విరాట్ కోహ్లీతో ఫోటో దిగాలనే కల నిజమైందంటూ ట్విటర్లో పేర్కొంది. తొలి టెస్టు అనంతరం కోహ్లీ భారత్కు రానున్నాడు. విరాట్ సతీమణి అనుష్క శర్మ 2021, జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటంతో విరాట్ పితృత్వ సెలవులు తీసుకున్నాడు.