రెండో ఓవర్లోనే రాహుల్ ఔట్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్రీజులోకి కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లు వచ్చారు. తొలి సెషన్ రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్ (9) పరుగుల వద్ద ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన పుజారా తొలుత నెమ్మదిగా ఆడి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు.
మయాంక్ హాఫ్ సెంచరీ
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77) క్రీజులో నిలవడంతో టీమిండియా 32 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లకు వికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత జట్టు స్కోరు 126 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ సిక్స్ బాదిన మయాంక్, ఆ తర్వాత బంతిని కూడా అలానే హిట్ చేసేందుకు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు.
23 పరుగులకే కోహ్లీ ఔట్
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (23) జట్టు స్కోరు 180 వద్ద మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్ రహానే (18)తో కలిసి పుజారా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే కీలక సమయంలో కోహ్లీ, రహానే ఔటైనా... పుజారా మాత్రం నిలకడగా ఆడుతూ ఈ సిరీస్లో మూడో సెంచరీని నమోదు చేసుకున్నాడు.
మిడిలార్డర్లో హనుమ విహారి
రోహిత్ శర్మ భారత్కు తిరుగు పయనం కావడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్కి మరోసారి భారత్ తుది జట్టులో అవకాశమిచ్చింది. గత టెస్టులో ఓపెనర్గా ఆడిన హనుమ విహారి.. రోహిత్ శర్మ స్థానంలో మిడిలార్డర్లో ఆడనున్నాడు. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకి అనుకూలిస్తుందని వార్తలు రావడంతో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది.


Click it and Unblock the Notifications












