రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే (ఫోటోలు)
హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు పలు రికార్డులు నమోదయ్యాయి. తొలి రెండు రోజులు పెద్దగా ఆశలు లేని స్థితి నుంచి మ్యాచ్ను గెలిచే స్థాయికి చేరుకుంది. 11 గంటల పాటు క్రీజులో నిలిచి పుజారా (525 బంతుల్లో 21 ఫోర్లతో 202) మారథాన్ ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 603/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
పుజారాకి ఇది మూడో డబుల్ సెంచరీ. పుజారాకి తోడు సాహా (233 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్తో 117) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఏడో వికెట్కు వీరిద్దరి 199 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ను మలుపు తిప్పింది. చివర్లో జడేజా (55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్) మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 152 పరుగుల ఆధిక్యం లభించింది.
రాంచీ టెస్టులో నాలుగో రోజు నమోదైన రికార్డులివే:

ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఆడిన క్రికెటర్గా పుజారా
* టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఆడిన భారత క్రికెటర్గా పుజారా (525 బంతులు) అరుదైన రికార్డు నెలకొల్పాడు.
* అంతక ముందు క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ (495 బంతుల) రికార్డును పుజారా బద్దలుకొట్టాడు. ద్రవిడ్ 2004లో పాకిస్థాన్పై రావల్పిండిలో ఆడిన 270 పరుగుల ఇన్నింగ్స్లో ఈ రికార్డు నెలకొల్పాడు.

అత్యంత నెమ్మదిగా చేసిన డబుల్ సెంచరీ
* ఓ భారత బ్యాట్స్మెన్ అత్యంత నెమ్మదిగా చేసిన డబుల్ సెంచరీ ఇదే కావడం విశేషం. 521 బంతుల్లో పుజారా డబుల్ సెంచరీ (202) పరుగులు చేశాడు. గతంలో సిద్ధూ విండీస్పై 491 బంతుల్లో 202 పరుగులు సాధించాడు.
* 11 ఫస్ట్ క్లాస్ కెరీర్లో పుజారా డబుల్ సెంచరీలు. భారత క్రికెట్లో అత్యధిక ఫస్ట్క్లాస్ ద్విశతకాలు సాధించిన విజయ్ మర్చంట్ రికార్డును సమం చేశాడు.

మూడు టెస్టు సెంచరీలు చేసిన సాహా
* టెస్టు కెరీర్లో సాహా మూడు సెంచరీలు చేయగా, ఆస్ట్రేలియాపై మొదటిది. ఈ మూడు సెంచరీలను సాహా 6, 7, 8 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి చేయడం విశేషం.
* ధోని (6) తర్వాత అత్యధిక శతకాలు సాధించిన భారత వికెట్ కీపర్ అతనే.
* ఏడో వికెట్కు పుజారా-సాహాలు 199 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆసీస్పై ఈ వికెట్కు ఇదే అత్యుత్తమం. 1947-48లో హేమూ అధికారి-విజయ్ హజారే అడిలైడ్లో నెలకొల్పిన 132 పరుగుల భాగస్వామ్యాన్ని వీళ్లు అధిగమించారు.

ఆస్ట్రేలియాపై 600లకు పైగా స్కోరు
* టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 600లకు పైగా స్కోరు సాధించడం భారత్కు ఇది ఆరోసారి. 2004లో సిడ్నీలో 705/7 చేసిన స్కోరే ఇప్పటికి అత్యధికం.
* భారత గడ్డపై ఓ ఇన్నింగ్స్లో అత్యధిక ఓవర్లు వేసిన రెండో బౌలర్గా ఒకీఫ్ (77 ఓవర్లు) నిలిచాడు. హసీబ్ అహసాన్ (పాక్-84 ఓవర్లు; 1961లో) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆరో బ్యాట్స్మన్ పుజారా
* ఆస్ట్రేలియాపై రెండు అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఆరో బ్యాట్స్మన్ పుజారా. వ్యాలీ హామండ్ (6), బ్రియాన్ లారా (3), గ్రేమ్ పొలాక్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ (2) ఈ జాబితాలో ఉన్నారు.
* ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 53 ఏళ్ల తర్వాత ఓ బ్యాట్స్మన్ 500 కంటే ఎక్కువ బంతులు ఆడాడు. చివరిసారి 1964లో కెన్ బారింగ్టన్ (ఇంగ్లండ్-624 బంతులు) ఈ ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications