
పుజారా, పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్తో
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో పుజారా, రిషబ్పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్తో సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ మైదానం(ఎస్సీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో పుజారా 193 పరుగులు చేయగా.. పంత్ 159 నాటౌట్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 622 పరుగుల భారీ స్కోరుకు బాటలు వేసిన పుజారా, పంత్.. ఈ బోర్డుపై తమ సంతకాలు చేశారు. శనివారం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన అనంతరం ఎస్సీజీ నిర్వాహకులు వారిని ఆనర్ బోర్డుపై సంతకాలు చేయాల్సిందిగా కోరారు.
వీడియోలను ట్విటర్లో పంచుకున్న బీసీసీఐ
దీంతో ఇద్దరు బోర్డుపై సంతకాలు చేసి ఈ గౌరవం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది. పుజారా ఈ సిరీస్లో మూడో సెంచరీ నమోదు చేయగా.. పంత్ ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

పంత్, జడేజా ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త రికార్డు
గురువారం మొదలైన ఈ 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో చతేశ్వర్ పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సూపర్ సెంచరీలు, రవీంద్ర జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, జడేజా జోడి ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. సిడ్నీ టెస్టులో వీరిద్దరూ కలిసి జట్టులో ఏడో వికెట్కు 204 పరుగులు జోడించారు.

ఏడో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని
ఆసీస్ గడ్డపై ఏ జట్టుకైనా ఏడో వికెట్కు ఇదొక అత్యధిక భాగస్వామ్యం. అంతేకాకుండా భారత్ తరఫున ఏడో వికెట్కు ఇది ఆరో అత్యధిక భాగస్వామ్యం. గతంలో భారత్ తరఫున ఏడో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని వీవీఎస్ లక్ష్మణ్, అజయ్ రాత్రాలు నమోదు చేశారు. వీరిద్దరూ వెస్టిండీస్పై 7వ వికెట్కు 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


Click it and Unblock the Notifications












