ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ నజరానా


హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ను నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియాకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ నజనారా ప్రకటించింది. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున నగదు బహుమానం ఇవ్వనున్నట్టు బీసీసీఐ తెలిపింది. జట్టులోని ఆటగాళ్లు అందుకోబోయే బోనస్ మ్యాచ్ ఫీజ్కి ఇది సమానంగా ఉంది.
ఇక, రిజర్వ్ ప్లేయర్లకు సైతం రూ.7.5 లక్షల నజరానా అందించనున్నట్టు బోర్డు తెలిపింది. ఆటగాళ్లతో పాటు కోచ్లకు కూడా రూ.25 లక్షల చొప్పున నగదు బహుమానం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇక ఆటగాళ్లు అందుకోబోయే నగదు బహుమానం మ్యాచ్ ఫీజుకి సమానం కాగా.. ఆటగాళ్ల కంటే కోచ్లకు ఇచ్చే నజరానా ఎక్కువగా ఉండటం గమనార్హం.
సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది.

టీమిండియా ప్రస్తుత పర్యటనని ఓసారి పరిశీలిస్తే!
ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా గెలవడంలో భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ పుజారా క్రియాశీలక పాత్ర పోషించాడు. సిరీస్లో జరిగిన నాలుగు టెస్టుల్లో ఏకంగా మూడు సెంచరీలు నమోదు చేసిన అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్
ఈ సిరిస్లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. పుజారాతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 350 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 282 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఇక, బౌలింగ్లోనూ భారత్ ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ పేసర్ల కంటే మెరుగ్గా రాణించారు. జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లతో కెరీర్లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేయగా ఆ తర్వాత మహ్మద్ షమీ 16, ఇషాంత్ శర్మ 11 వికెట్లు పడగొట్టారు.

2-1తేడాతో టెస్టు సిరిస్ కైవసం
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరిస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

ఆసీస్ గడ్డపై పర్యాటక జట్లు నమోదు చేసిన సిరీస్ విజయాలు
తాజా టెస్టు సిరిస్ విజయంతో ఆస్ట్రేలియాలో పర్యాటక జట్లు నమోదు చేసిన సిరీస్ విజయాలు ఇలా ఉన్నాయి. ఇంగ్లాండ్ రికార్డు స్థాయిలో 13 సార్లు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయాలు నమోదు చేయగా వెస్టిండిస్ జట్టు 4 సార్లు విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 3 సార్లు, న్యూజిలాండ్, భారత్ ఒక్కోసారి సిరీస్ విజయాలను నమోదు చేశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications